హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యవసాయ మార్కెట్ కమిటీలను కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 193 వ్యవసాయ మార్కెట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన కమిటీలే కొనసాగుతున్నాయి. వాటిని తొలగించి కాంగ్రెస్ నేతలతో కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
మార్కెట్ కమిటీలను రద్దుపై వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. అయితే, కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించిన మాదిరిగా ఒక్క జీవోతో మార్కెట్ కమిటీలను తొలగించడం సాధ్యం కాదని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ కమిటీలను తొలగించాలంటే ప్రస్తుతం అమలులో ఉన్న మార్కెటింగ్ చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ఇందుకు క్యాబినెట్ అనుమతితోపాటు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కమిటీల చట్టంలో పలు మార్పులు చేసింది. మార్కెట్ కమిటీల పదవీ కాలాన్ని మూడేండ్ల నుంచి ఏడాదికి కుదించింది. డైరెక్టర్ల సంఖ్యను 18కి పెంచింది. చైర్మన్ పదవీ కాలాన్ని రెండేండ్లుగా నిర్ణయించింది. ఆ తర్వాత ఆరు నెలల చొప్పున రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించుకొనే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కమిటీలను రద్దు చేయాలంటే ఏదో ఒక అంశంతో చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అంతేగానీ నేరుగా రద్దు చేసే అవకాశం లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఆసక్తిగా మారింది.