నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టేందుకు సీఎం, మంత్రులు రాష్ట్రంలో రైతులకు టోకరా వేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. రైస్ మిల్లర్ల నుంచి వందల కోట్లు వసూలు చేసి ధాన్యం కొనుగోళ్లను వాళ్లకే వదిలేశారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ అడుగు బయటపెడితే తప్ప సాగునీళ్లు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నదని విమర్శించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తాల్సిన రేవంత్రెడ్డి పార్టీ ఫిరాయింపుల కోసం గేట్లు ఎత్తడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రాగానే కృష్ణానదిని కేంద్రం చేతిలో పెట్టారని, కేసీఆర్ నల్లగొండ మీటింగ్కు వచ్చి గర్జిస్తేనే కేఆర్ఎంబీపై అసెంబ్లీలో తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. ఇటీవల ఎండిన పొలాలను చూసి రైతుల పక్షాన కేసీఆర్ మాట్లాడితే సర్కార్ కదలక తప్పలేదని, వెంటనే కాళేశ్వరం లిఫ్ట్లు నడిపి నీళ్లు ఇచ్చారని చెప్పారు. ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం, రూ.500 బోనస్, రైతు భరోసా, సాగునీళ్లు అడిగితే.. జవాబు చెప్పలేక రేవంత్రెడ్డి దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.
పాలన చేతగాక కేసుల పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్పై ఇప్పటి వరకు తెల్చిందేమీ లేదని, నిజంగా వెలికితీయాలనుకుంటే చంద్రబాబు నుంచి మొదలుపెట్టాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, పార్టీ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, పల్లా ప్రవీణ్రెడ్డి, కేతావత్ బిల్యానాయక్, కిషన్నాయక్, వడ్త్యా రమేశ్నాయక్, వశ్యానాయక్, కంకణాల ప్రవీణ, రెగట్టె మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు.