బాన్సువాడ, మార్చి 21: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడకు విచ్చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ శ్రేణులు పల్లెలు, గ్రామాల నుంచి పట్టణానికి, మండల కేంద్రాలకు చేరుకొని ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశాయి.
బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. స్పీకర్ శ్రీనివాసరెడ్డి, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసే అర్హత ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన రేవంత్రెడ్డికి లేదని విమర్శించారు. ఆయన నీతులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని పేర్కొన్నారు. బాన్సువాడ అభివృద్ధిపై ఏ గ్రామంలో చర్చకు వచ్చినా రేవంత్కు ప్రజలే సమాధానం చెప్తారని తెలిపారు.