KTR | కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన ‘బాకీ కార్డు’ ఉద్యమమే రేవంత్ సర్కార్ భరతం పట్టే బ్రహ్మాస్త్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గల్లీ ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. తెలంగాణలోని సబ్బండ వర్ణాలు తిరిగి కేసీఆర్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాయని అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరి, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తాము ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని కానీ ప్రజలకు అన్నీ గుర్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఈ బాకీ కార్డే కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తుందన్నారు.
టీడీపీ సీనియర్ నేత ప్రదీప్ చౌదరిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా, హైదరాబాద్ నగరం సమస్యలతో ఆగమాగం అవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నగరం కడతానంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రభుత్వ అసమర్థతతో హైదరాబాద్లో చెత్త తీసేవారు కరువయ్యారని, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, వీధి దీపాలు వెలగడం లేదని మండిపడ్డారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించలేని వారు కొత్త నగరం కడతామని ఫోజులు కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, కనీసం ఉన్న రోడ్లను కూడా సరిగా నిర్వహించడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం రైతులు యుద్ధాలు చేసే దుస్థితి ఉండేదని, నేడు మళ్లీ అవే రోజులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టే, ప్రాణాలు కోల్పోయే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాగంటి గోపినాథ్ నాయకత్వంలో హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కలేదని గుర్తుచేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన సతీమణి మాగంటి సునీతను ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించడం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రదీప్ చౌదరి వంటి ప్రజాబలం ఉన్న నాయకుల చేరికతో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.
తెలుగువారి ఖ్యాతిని యావత్ భారతదేశానికి చాటిచెప్పింది ఎన్టీఆర్ అయితే, తెలంగాణ అస్తిత్వ పతాకాన్ని, సత్తాను హిమాలయాల స్థాయిలో ఎగరేసింది కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని, పదేళ్ల పాలనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు.