Vinod Kumar | హైదరాబాద్ : అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తుంటే.. ఇప్పటికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశంపై తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
కృష్ణా ట్రిబ్యునల్ 2013లో అల్మట్టి ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి తీర్పు ఇచ్చింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తీర్పుఫై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో అప్పటి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేస్తే ట్రిబ్యునల్ తీర్పుపై స్టే వచ్చింది. 2014లో తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు స్టే కొనసాగించేలా చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. నిన్న కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి ప్రాజెక్టు విస్తరణ కోసం లక్షా 33 వేల ఎకరాల భూ సేకరణ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. ఈ భూ సేకరణ కోసం రెండేళ్లలో రూ. 70 వేల కోట్లు ఖర్చు పెట్టాలని కర్ణాటక లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. కర్ణాటక అల్మట్టిపై నిర్ణయం తీసుకుని రెండు రోజులు అవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా స్పందించలేదు. సుప్రీంకోర్టు స్టే పెండింగ్లో ఉండగానే కర్ణాటక అల్మట్టి ఎత్తు పెంచడానికి తీసుకున్న నిర్ణయంపై తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
కృష్ణా నదిలో ఒక్క నీటి చుక్కను వదలుకోమని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఓ సమీక్ష సమావేశంలో చెప్పారు. మరి కర్ణాటక అక్రమంగా అల్మట్టి ఎత్తు పెంచుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కర్ణాటక నిర్ణయంపై స్పందించారు. అల్మట్టి ఎత్తు పెంచితే తమ రాష్ట్రంలోని రెండు జిల్లాలు సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాల్లో ముంపు ఉంటుందని మహారాష్ట్ర సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అల్మట్టి ఎత్తు పెంపును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని అడ్డుకుని తీరుతామని ఫడ్నవీస్ హెచ్చరించారు అని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
కేసీఆర్పై ద్వేషమే తప్ప రేవంత్ రెడ్డికి కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం చేయాలని లేదు. కేసీఆర్ పట్టుదలతోనే సెక్షన్ 3 ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి. కేసీఆర్ కృష్ణా ట్రిబ్యునల్ కోసం 33 లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తగ్గించారని కేసీఆర్పై రేవంత్ రెడ్డి పదే పదే నిందలు వేస్తున్నారు. నిన్న కూడా సెప్టెంబర్ 17 వేడుకల ప్రసంగంలోనూ కేసీఆర్పై రేవంత్ రెడ్డి విషం చిమ్మారు. తెలంగాణ ఏర్పడ్డ నెల రోజులకే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం లేఖ రాశారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటును మహారాష్ట్ర, కర్ణాటక వ్యతిరేకించినా కేసీఆర్ మాటనే చివరకు నెగ్గింది. కేసీఆర్పై నిందలు మాని అల్మట్టిపై కర్ణాటక దూకుడును రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా..? రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సుప్రీంకోర్టులో కర్ణాటకకు వ్యతిరేకంగా కంటెంప్ట్ పిటిషన్ వేయాలి. అల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుంది.. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.