Vinod Kumar | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు ఎన్నికలప్పుడు నమ్మారు కానీ.. ఇప్పుడు నమ్మే స్థితిలో లేరని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో వినోద్ కుమార్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
స్థానిక ఎన్నికలు, జీవో నంబర్ 9పై నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ ప్రజలు ఎవ్వరూ ఈ జీవోను నమ్మలేదు. రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో రిజర్వేషన్లు ఇచ్చినట్టు బీసీలు నమ్మలేదు. ప్రజలు ఈ జీవోపై ముందే తీర్పునిచ్చారు. మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని రేవంత్ గతంలోనే చెప్పారు. ఎన్నికలప్పుడు ఆయన మాటలు ప్రజలు నమ్మారు కానీ ఇపుడు నమ్మడం లేదు. దసరా పండగ అపుడే ప్రజలు ఎన్నికలు జరగవని నిర్ణయానికి వచ్చారు అని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది 1 .6 శాతం ఓట్ల తేడాతోనే. నిన్న భట్టి విక్రమార్క బీజేపి, బీఆర్ఎస్లను విమర్శిస్తున్నారు. బీజేపీని విమర్శిస్తే అర్థం ఉంది. బీఆర్ఎస్ను విమర్శించడానికి లేదు. గతంలోనే కేసీఆర్ బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసి కేంద్రానికి పంపారు. కేంద్రం వద్ద అది ఇంకా పెండింగ్లో ఉంది. బీఆర్ఎస్ చిత్తశుద్ధిని శంకించడానికి లేదు. ఇందిరాగాంధీ పదవికి ముప్పు వచ్చినపుడు ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారు. ఓ వ్యక్తి కోసం కాంగ్రెస్ పార్టీ నాడు రాజ్యాంగాన్ని సవరించింది. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కుదరదని కృష్ణమూర్తి కేసులో సుప్రీం తీర్పు వచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ తీర్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదు..? ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగాన్ని సవరిస్తారు. బీసీల కోసం సవరించరా..? అని వినోద్ కుమార్ నిలదీశారు.
రాహుల్ గాంధీ మోడీని పార్లమెంటులో కౌగిలించుకుంటారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ మోడీని ఎందుకు కౌగిలించుకోరు?
రాహుల్ గానీ ఖర్గే గానీ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీవి మోసపూరిత మాటలే తప్ప చిత్తశుద్ధి లేదు. రాహుల్ మోడీ తలచుకుంటే బీసీ రిజర్వేషన్లు పెరగవా? ఈ దేశం రాజ్యాంగం మీద నడుస్తుంది తప్ప మరెవరి ఇష్టాయిష్టాల మీద కాదు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.