జయశంకర్భూపాలపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకే 22-ఏ జాబితాను తీసుకొచ్చిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే బుధవారం అసెంబ్లీలో 22ఏపై చేపట్టిన చర్చలో భాగంగా భూపాలపల్లిలో 106 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు అప్పగించిందని ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
భూపాలపల్లిలో 106 ఎకరాల ఫారెస్ట్ భూమిని తాను కబ్జా చేసినట్లు చూపిస్తవా..? అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ఎవరో రాసిచ్చిన స్రిప్ట్ను పట్టుకొని తాడిచెర్లలోని రూ.50 వేలకు గజం విలువ చేసే 106 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని కబ్జా చేశానడం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు. 106 ఎకరాల ఫారెస్ట్ భూమిని కబ్జా చేసేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరులు, బంధువులు అబ్దుల్ కాసీం అనే ఓ ప్రైవేట్ వ్యక్తితో వరంగల్ కోర్టులో కేసు వేయిస్తే, కోర్టులో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు.
దీంతో ఆ వ్యక్తి జేసీబీ, ట్రాక్టర్లను తీసుకొచ్చి చదునుచేసే యత్నం చేయగా, తాను ఫారెస్ట్ అధికారులను పంపి పనులు ఆపించినట్టు చెప్పారు. 2024లో ఫారెస్ట్ అధికారులతో సుప్రీంకోర్టులో ఫిటిషన్ వేయించగా, వాదనలు విన్న సుప్రీంకోర్టు అది అటవీ భూమిగానే తీర్పునిచ్చిందని చెప్పారు. తనకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే తనపై గతంలో 1,400 ఎకరాలు భూకబ్జా చేశానని తప్పుడు ఆరోపణలు చేశారని గుర్తుచేశారు.