సిడ్నీ : ఆస్ట్రేలియా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను తోడుగా తెచ్చుకోవడంపై కొత్త విధానాలను తీసుకొచ్చింది. డిగ్రీలు, ఇతర కోర్సుల్లో చదువుకునే విద్యార్థులు ఇక నుంచి ఒంటరిగానే రావాలని, భాగస్వాములు లేదా 18 ఏండ్లలోపు పిల్లలను వెంట తీసుకురావడానికి వీళ్లేదని ఆ దేశ హోం అఫైర్స్ మంత్రి టోనీ బర్క్ వెల్లడించారు. విదేశీ వలసలను ఏడాదికి 2,50,000కు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
విద్యార్థులతో పాటు సెకండరీ వీసాలు, డిపెండెంట్ వీసాల ద్వారా తమ దేశానికి వస్తున్న వలసదారులతో ఇబ్బందులు వస్తున్నాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతున్నది. మౌలిక సదుపాయాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నది. ఇప్పటికే విద్యార్థి వీసాలపై అనేక షరతులు విధిస్తూ తిరస్కరిస్తున్న ఆస్ట్రేలియా.. వీసా ఫీజులను కూడా పెంచేసింది. ఇప్పుడు కొత్త నిబంధనతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.