న్యూఢిల్లీ: ప్రధాన జాతీయ స్థాయి ప్రవేశ, అర్హత పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక తేదీలను ప్రకటిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) గురువారం తన పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. క్యాలెండర్ ప్రకారం జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షను 2027 జవనరి 22, 23, 24, 28, 29, 30 తేదీలలో నిర్వహించాలని ప్రతిపాదించారు. ఎన్ఐఎఫ్టీ ప్రవేశ పరీక్ష జనవరి 10న జరగనుండగా, నిర్దేశిత ప్రాంతాల విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్యను అందించే శ్రేష్ట (ఎన్ఈటీఎస్) పరీక్షను కూడా అదే రోజున నిర్వహించాలని ప్రతిపాదించారు.
అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష జనవరి 31న జరగనుండగా ఆర్మీ క్యాడెట్స్ కాలేజీ పరీక్ష జనవరి 4న నిర్వహించనున్నారు. సీయూఈటీ-పీజీ పరీక్షను 2027 మార్చి 1, 5, 8, 12-20, 24-25 తేదీలలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్(ఎన్ఐటీటీటీ) పార్ట్-1 పరీక్ష ఫిబ్రవరి 26,27 తేదీల్లోనూ, పార్ట్-2 పరీక్ష మార్చి 5, 7 తేదీల్లోనూ నిర్వహిస్తారు. యూజీసీ-నెట్ డిసెంబర్ సైకిల్ని ఈ ఏడాది డిసెంబర్ 14 నుంచి 19 వరకు నిర్వహించాలని ప్రతిపాదించారు. జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్ డిసెంబర్ సైకిల్ పరీక్షలు డిసెంబర్ 20, 21 తేదీల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 6న రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ) పరీక్ష, డిసెంబర్ 8 నుంచి 12 వరకు స్వయం పరీక్షలు, డిసెంబర్ 13న రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ పరీక్ష ఉన్నాయి. సీమ్యాట్ను 2027 ఫిబ్రవరి 7న నిర్వహించాలని ప్రతిపాదించారు.