కాంగ్రెస్ సర్కారు గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకొన్నది. ఎన్నికల హామీలు ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నది. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా అమలు చేసి తీరాల్సిందే.
-హరీశ్రావు
Jagadish Reddy | నల్లగొండ ప్రతినిధి, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రైతుబంధు గురించి ప్రశ్నించిన రైతులను చెప్పుతో కొడతామనడం దుర్మార్గమని, చెప్పులతో కొట్టించుకునేందుకే ప్రజలు ఓట్లు వేశారా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ నెపాన్ని కేసీఆర్పై నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అధ్యక్షతన శనివారం జిల్లాకేం ద్రంలో నల్లగొండ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని కేసీఆర్ నాయకత్వా న్ని బలపర్చేందుకు తెలంగాణ సమాజం రెడీ అవుతున్నదని పేర్కొన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించి విజయఢంకా మోగిద్దామని పిలుపునిచ్చారు. ఆచరణ సాధ్యం కాని 420 హామీలిచ్చి కాంగ్రెస్ గెలిచిందని, వాటిని అమలు గురించి అడిగితే మంత్రులు వ్యక్తిగత దూషణలు, బూతులతో ఎదురుదాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.
అధికారం అడ్డం పెట్టుకుని దాడులు చేస్తూ, కేసులు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారం పదిరోజుల్లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెడతారని, త్వరలోనే నల్లగొండకు కూడా వస్తారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల అవిశ్వాసాల సాక్షిగా మరోసారి కాంగ్రెస్, బీజేపీ ఐక్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని విమర్శించారు.
భారీగా తరలివచ్చిన శ్రేణులు
నల్లగొండ నియోజకవర్గం నలుమూలల నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమావేశానికి తరలివచ్చారు. సమావేశం నిర్వహించిన నల్లగొండలోనే అతిపెద్దద యిన లక్ష్మీగార్డెన్ పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది.
సమావేశంలో జడ్పీ చైర్మన్లు బండ నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, గాదరి కిశోర్కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి, నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మందడి సైదిరెడ్డి, పంకజ్ యాదవ్, అభిమన్యు శ్రీనివాస్, మాలె శరణ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.