రంగారెడ్డి : సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తు సమన్యాయం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు యంజాల అర్జున్ ఆధ్వర్యంలో జల్పల్లి, శ్రీరామకాలనీకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆమె మాట్లాడుతూ గడప గడపకు శుద్ధి చేసిన నీళ్లు అందించే మిషన్భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిల్చిందని అన్నారు. ఒక వైపు రాష్ట్ర అభివృద్ధికి, మరో వైపు ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేసే ముఖ్యమంత్రి ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయం,విద్యా, ఆరోగ్యం, విద్యుత్ రంగాలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయని వెల్లడించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో మున్సిపాలిటీ పరిధిలో వరదనీరు సాఫీగా వెళ్లడానికి కోట్లాది రూపాయల నిధులతో నాలా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే కాకుండా దేశం అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఆలోచన చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, శంకర్, బీఆర్ఎస్ నాయకులు దూడల శ్రీనివాస్గౌడ్, రాజేశ్ పాల్గొన్నారు.