హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ ప్రక్రియ విజయవంతం కావడంలో బూత్ లెవల్ అధికారుల (బీఎల్వో) పాత్ర అత్యంత కీలకమని, వారి పనితీరు మరింత మెరుగ్గా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న బీఎల్వోలకు సవరణ ప్రక్రియపై పూర్తి అవగాహన లేదని పేర్కొన్నది. దీనికితోడు క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవసరమైన ఫారాలు కూడా అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయని ఈసీ దృష్టికి తెచ్చింది.
హైదరాబాద్లో ఇలాంటి లోపాలను గుర్తించిన తర్వాత, స్పందించి కొంతమంది అధికారులను మార్చిన విషయాన్ని గుర్తుచేసింది. డిజిటలైజేషన్ 5 నుంచి 10 శాతం మాత్రమే పూర్తయినందున మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఒకటి నుంచి రెండు నెలలపాటు గడువు పొడిగించాలని కోరింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, లోక్సభ మాజీ సభ్యుడు వినోద్కుమార్, పార్టీ ప్రధానకార్యదర్శి సోమ భరత్కుమార్తో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీ అశోకారోడ్డులో ఉన్న నిర్వాచన్ సదన్లో శుక్రవారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్కుమార్, కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్సింగ్ సంధూ, డాక్టర్ వివేక్జోషీలతో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసింది.
ఎస్ఐఆర్ ప్రక్రియ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, పూర్తిగా నిష్పాక్షికంగా, నిజాయితీగా, ప్రతి అర్హుడైన పౌరుడికీ న్యాయం జరిగేలా నిర్వహించాలని బీఆర్ఎస్ తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. సీఈసీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నదని ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 5 నుంచి 10 శాతం మాత్రమే పూర్తయినందున ఒకటి నుంచి రెండు నెలలపాటు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలు పూర్తిగా ప్రక్షాళన కావాలంటే సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న డూప్లికేట్ ఓటర్ల సమస్యను కూడా పరిషరించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తెలంగాణ-మహారాష్ట్ర, తెలంగాణ-కర్ణాటక, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు నమోదైన సందర్భాలు ఉన్నాయని, అలాంటి లోపాలను ఎస్ఐఆర్ ద్వారా సరిదిద్దాలని అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించాం: వినోద్
బీఆర్ఎస్ పార్టీ పక్షాన భారత ఎన్నికల సంఘానికి ‘సర్’ ప్రక్రియపై పలు సూచనలు, సలహాలు ఇచ్చామని, ముఖ్యంగా ఆధార్ అనుసంధానంతో డూప్లికేట్లకు చెక్ పెట్టవచ్చని తెలిపామని మాజీ ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పక్షాన రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేల మంది బూత్ లెవల్ అసిస్టెంట్లను నియమించామని, వారు ప్రతి బూత్లో ఓటర్లకు సహాయపడుతూ సవరణ ప్రక్రియలో భాగస్వాములవుతున్నారని చెప్పారు.
ఓటరు జాబితాల ప్రక్షాళన నిరంతర ప్రక్రియ అని పేరొన్న ఆయన.. సాంకేతిక పరిజ్ఞానాన్ని విసృ్తతంగా వినియోగిస్తే ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థంగా సాగుతుందని చెప్పారు. ఓటరు వివరాలను ఆధార్తో అనుసంధానం చేస్తే డూప్లికేట్ నమోదును గుర్తించడం సులభమవుతుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆధార్ను తప్పనిసరి చేయడం సాధ్యం కాదని, అయినా, తమ అనుభవం ప్రకారం దాదాపు 99 శాతం మంది ఓటర్లు స్వచ్ఛందంగా ఆధార్ వివరాలను అందిస్తున్నారని తెలిపారు. అలాంటి సందర్భాల్లో ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు, పారదర్శకతకు ఎంతో ఉపయోగ పడుతుందని ఈసీకి వివరించిట్టు పేర్కొన్నారు.