నల్లగొండ: దేశానికి మంచి భౌష్యత్తు ఇచ్చేలా ఖమ్మం సభ జరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశాన్ని లౌకికశక్తిగా ఉంచేలా ఖమ్మం సభ మార్గదర్శనం చేసిందన్నారు. అవగాహన లేక ఆరోపణలు చేసేటోళ్లకు ఈ సభ సరైన సమాధానం చెప్పిందని వెల్లడించారు. ప్రతిపక్షాలకు అధికార యావ తప్ప మరో ఆలోచన లేదని విమర్శించారు. నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కేంద్రపై పోరాటం మొదలైందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలులో ఉన్నాయా అని ఆ పార్టీ నేతలు ప్రశ్నించుకోవాలని సూచించారు.
ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ కేంద్రం దుర్నీతికి పాల్పడుతున్నదని విమర్శించారు. కేంద్రానిది వ్యాపార దృక్పథమని, దేశానికి అది మంచిది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజం పాలనలో కూడా ఎన్నో మంచి పథకాలు అమలుచేశారని వెల్లడించారు. హైదరాబాద్లో నిజం ఆఖరి వారసుడి అంత్యక్రియలపై కూడా రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గమని చెప్పారు. ఓట్ల కోసం మత రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
ఎవరైనా గౌరవం కాపాడుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను ఉద్దేశించి అన్నారు.
ఇప్పటివరకు ప్రభుత్వం పంపించిన ఏడు బిల్లులు గవర్నర్ ఆమోదించకుండా తనవద్దే పెట్టుకున్నారని, మరి అభివృద్ధి ఎలా జరుగుతుందనే ఆలోచన చేయాలని సూచించారు. అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిల్లులను కూడా ఆపడం ఏంటని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి జోకర్లా తయారయ్యాడని, అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.