BRS | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు బీజేపీపై, ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ముఖ్య కమిషనర్కు, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్రెడ్డి ప్రజలను రెచ్చగొట్టడమే కాకుండా, గౌరవస్థానంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తోపాటు ఆయన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నెల 6న నిర్వహించిన తుక్కుగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కట్టిస్తున్నా.. నీకూ, నీ కొడుక్కు, నీ అల్లుడికి, నీ బిడ్డకు’ అంటూ కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ పేర్కొన్నది. ఎన్నికలు సజావుగా సాగాలంటే సీఎం రేవంత్రెడ్డిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది.
బీజేపీపై చర్యలు తీసుకోండి
బీజేపీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి నివేదించింది. ఈ నెల 8న బీజేపీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పార్టీ నేతలను కించపరుస్తూ వారి పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగే విధంగా బీజేపీ వ్యవహరించిందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ పోస్టును తక్షణమే తొలగించి, ఇందుకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని కోరింది.
ఆంధ్రజ్యోతిపై చర్యలు తీసుకోండి
అసత్య కథనాలను వండివారుస్తూ తమ పార్టీపై అక్కసు వెళ్లగక్కుతున్న ఆంధ్రజ్యోతి పత్రికపై ఎన్నికల ప్రవర్తనా నియావళిని అనుసరించి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ‘ట్యాపింగ్ కేసులో 10 మందికిపైగా బీఆర్ఎస్ నేతలు, విచారణలో రాధాకిషన్రావు వెల్లడి’ అంటూ తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు ఉన్నతాధికారులెవరూ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదని, కనీసం ప్రెస్మీట్ కూడా నిర్వహించలేదని ఉదహరించింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసి, కాంగ్రెస్కు లబ్ధిచేకూరేవిధంగా ఆంధ్రజ్యోతి తప్పుడు, అసత్య కథనాన్ని ప్రచురించిందని, ఇది ముమ్మాటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం నేరమని పేర్కొన్నది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఎడిటర్ కే శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.