హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘ఔర్ ఏక్ ధక్కా..హ్యాట్రిక్ పక్కా’.. ఇదీ! బీఆర్ఎస్ శ్రేణుల సమర నినాదం. తెలంగాణ ఉద్యమంలో విపక్షాల కుట్రలను ఎంత పట్టుదలతో ఛేదించారో, అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నాయి. ఎక్కడిక్కడ అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టేందుకు పకడ్బందీ కార్యాచరణను అమలు చేస్తున్నాయి. పోలింగ్ బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా ఎక్కడిక్కడ అన్ని స్థాయిల పార్టీ నేతలు తామే అభ్యర్థులుగా కార్యక్షేత్రంలో కథానాయకులై ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ సహా పోటీచేస్తున్న పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మరే రాజకీయ పార్టీకి లేని ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్కు అదనపు బలం.
కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావటమే లక్ష్యం
బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోగలిగిన పార్టీ ఇంతవరకు లేదని అనేక పర్యాయాలు రుజువైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండు పర్యాయాలు విజయం సాధించిన బీఆర్ఎస్, మూడో దఫా కూడా విజయ దుందుభి మోగించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నది. దక్షిణాదిలో మూడోసారీ గెలిచి హ్యాట్రిక్ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదనే అపోహలను పార్టీ శ్రేణులు ఎక్కడిక్కడ తొలగిస్తున్నాయి.
వినూత్న ప్రచారం.. వివేచనాస్త్రం
క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం, వర్గాల వారీగా సమావేశాలకు తోడు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం వరకు 90 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో తలపడే ఏ పార్టీ, ఏ నాయకుడూ ఈ స్థాయిలో రాష్ట్రం అంతటా చుట్టివచ్చిన దాఖలాలు లేవు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు నిర్వహిస్తున్న రోడ్షోలు, సమావేశాలు అక్కడక్కడ ఏర్పడిన అభిప్రాయబేధాలను తొలగిస్తున్నాయి.
ఎన్నికలేవైనా గులాబీదే విజయం
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 119 సీట్లకుగాను 63 స్థానాలు (34.04 శాతం ఓట్లు) గెలుచుకొని అధికారం చేపట్టింది. 2018 ఎన్నికల్లో మొదటిసారి కన్నా 25 సీట్లు అదనంగా.. మొత్తం 88 సీట్లు (46.90 ఓట్లు) గెలుచుకొని బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలలో 17 సీట్లకు గాను 11 గెలుచుకొని 34.67 శాతం ఓట్లు, 2019లో జరిగిన లోకసభ ఎన్నికలలో 9 సీట్లు గెలుచుకొని 41.30 శాతం ఓట్లు కైవసం చేసుకుంది. 2014 లోక్సభ ఎన్నికల కంటే 2019లో 2 సీట్లు తగ్గినప్పటికీ ఓట్ల శాతం మాత్రం గణనీయంగా 34.67 నుంచి 41.30 శాతానికి పెంచుకోవడం గమనార్హం. ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయబావుటా ఎగరేసింది. 2014లో జరిగిన మెదక్ లోక్సభ ఉప ఎన్నికలలో 55 శాతం, 2015లో జరిగిన వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలలో 60 శాతం ఓట్లు సాధించి రికార్డు సృష్టించింది. 2016లో నారాయణఖేడ్ ఉపఎన్నికలో 60 శాతం ఓట్లు గెలుచుకోగా, పాలేరు ఉప ఎన్నికలో 55 శాతం, హుజూర్నగర్ ఉప ఎన్నికలో 56 శాతం, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో 40.78 శాతం, మునుగోడులో 42.95 శాతం ఓట్లు కైవసం చేసుకొని రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తి బీఆర్ఎస్సేనని నిరూపించుకున్నది. ఇప్పుడు మూడోసారి అంతకన్నా ఎక్కువ సీట్లే సాధిస్తామన్న విశ్వాసంతో గులాబీ సైన్యం ముందుకు సాగుతున్నది.