హైదరాబాద్: బీఆర్ఎస్ సభకు ఖమ్మం ముస్తాబైంది. నగరం మొత్తం గులాబీ మయమైంది. ఎటుచూసినా బీఆర్ఎస్ జెండాలు, సీఎం కేసీఆర్తోపాటు పలవురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల హోర్డింగ్లు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే సభావేదిక వద్దకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా చేరుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి తలరివస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సభకు తరలివెళ్తున్న వాహనాలకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు.
ఇక వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్స్టేషన్ సెంటర్ వద్ద బహిరంగ సభకు తరలివెళ్తున్న పార్టీ శ్రేణు బస్సులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జెండాఊపి ప్రారంభించారు.
పెద్దపెల్లి జిల్లా కేంద్రం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, నకిరేకల్ నియోజకవర్గం నుంచి తరలివెళ్తున్న వాహనాలను నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు.
కాగా, సీఎం కేసీఆర్తో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అటునుంచి ఖమ్మం బయలుదేరనున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ను ప్రారంభించడంతోపాటు ఖమ్మం మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అంనతరం పలువురికి కంటి అద్దాలను అందజేస్తారు.