KTR | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్కు గుర్తుచేస్తామని అన్నారు. హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కేటీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని సూచించారు.
శాసనమండలి సభ్యులు కూడా ఇప్పటికే ఆప్ట్ చేసుకున్న తమ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని పార్టీ అధ్యక్షులు భావిస్తున్నారని తెలిపారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని అన్నారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివేట్ చేస్తామని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని.. వీటిని ఎదుర్కొనేందుకు పార్టీ సంసిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. త్వరలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని అన్నారు. ఆ భేటీలోనే శాసన మండలి పార్టీ నేతలను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు.