దేశానికి, రాష్ర్టానికి బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి? బీజేపీ ఒక్క మంచి పని చేసిందా.. తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. ఐటీఐఆర్ ఇవ్వలేదు. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లించుకుపోతున్నందుకా? కృష్ణా నది మీద ప్రాజెక్ట్లను కేఆర్ఎంబీకి అప్పగించినందుకా? రైతుల మోటర్లకు మీటర్లు పెట్టుమన్నందుకా? ఎందుకు బీజేపీకి ఓటెయ్యాలి..?
– కేసీఆర్
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించేలా లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రేవంత్రెడ్డి ప్రతిసారీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు తనతో చెప్పారని పేర్కొన్నారు.
ఒకవేళ అదే జరిగితే తాము బీఆర్ఎస్, ఎంఐఎంతో కలవాల్సి ఉంటుందని ఆయన అన్నారని వివరించారు. కట్టర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్తో కలిసి బీజేపీలోకి వెళ్లే అవకాశం లేదని, తనతో 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, తాను మాత్రం బీఆర్ఎస్కే మద్దతు ఇస్తానని కాంగ్రెస్ నేత తనతో చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ లోక్సభ అభ్యర్థులు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అభ్యర్థులకు బీఫాంలు అందించిన కేసీఆర్ ఎన్నికల ఖర్చులకు రూ. 95 లక్షల చెక్ అందించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యమకాలం నుంచి నేటివరకు తెలంగాణ ప్రజల హకులను కాపాడుతూ వస్తున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వారు ఢిల్లీలో తెలంగాణ ప్రజల గొంతుకలై పనిచేస్తారని పేర్కొన్నారు. ‘తెలంగాణ గొంతుక బీఆర్ఎస్, తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్, తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్’ అని చెప్పారు. రాష్ట్రం మీద కాంగ్రెస్కు మమకారం లేదని విమర్శించారు.
ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చు
పార్లమెంట్ ఎన్నికల తరువాత ప్రభుత్వంలో ఏమైనా జరగొచ్చని, ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందన్నది అనుమానమేనని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ 104 సీట్లు, ఎంఐఎం 7 సీట్లతో కలుపుకొని బలంగా ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించిన కేసీఆర్.. 65 సీట్లు మాత్రమే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండనిస్తారా? అని ప్రశ్నించారు. ‘రేవంత్రెడ్డి బీజేపీలోకి పోతాడని కేటీఆర్ అంటుండు.
ఆయన బీజేపీలోకి వెళ్లి ప్రభుతాన్ని ఏర్పాటు చేయాలంటే 58 మంది కాంగ్రెస్ సభ్యులు కావాలి. రేవంత్ వెంట అంతమంది పోరు. పాత కాంగ్రెస్, కరుడుగట్టిన కాంగ్రెస్ వాళ్లు ఆయనతో పోరు. దీంతో ఏం జరుగుతదో అర్థం కావడంలేదు. మోదీ ప్రమాదకరమైన వ్యక్తి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎటైనా దారితీయవచ్చు. బీజేపీ జమానాలో ఏమైనా సాధ్యమే. నవంబర్, డిసెంబర్ కల్లా ప్రభుత్వం ఉంటుందో ఉండదో కూడా తెలియదు’ అని కేసీఆర్ అనుమానం వ్యక్తంచేశారు.
మధ్యంతర ఎన్నికలు వచ్చినా రావొచ్చని పేర్కొన్నారు. 20-25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారని, అక్కడ పరిస్థితి బాగాలేదని, వాళ్లు వస్తామంటున్నారని తెలిపారు. ‘మావాడు బీజేపీలోకి పోతాడు’ అని వారే చెప్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మాత్రం స్థిరంగా ఉండాలని, ఉగిసలాటలో ఉండొద్దని కోరారు. బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్లు మళ్లీ వస్తామంటున్నా తీసుకోబోమని చెప్పానని తెలిపారు. పార్టీ నుంచి పోయిన ముఖ్యనాయకులు కూడా వస్తామంటున్నా అవసరం లేదని చెప్పినట్టు పేర్కొన్నారు. కొత్త నాయకులను తయారుచేసుకుందామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాం దొరికితే చాలు గెలిచేలా పరిస్థితులు మారబోతున్నాయని వివరించారు.
నాలుగు నెలలకే ప్రజలు విసుగెత్తిపోయారు
అడ్డగోలు, అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నదని, ప్రజల నుంచి అప్పుడే వ్యతిరేకత మొదలైందని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వరికోతలు అవుతున్నాయని, వడ్లు ఎక్కడివక్కడే కుప్పలుగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ధాన్యం కొనడం చేతకాక మిల్లర్ల మీద కేసులు బనాయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇస్తామన్న రూ. 500 బోనస్ కూడా లేదని మండిపడ్డారు. ఈ విషయాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లి చర్చ పెట్టాలని, మీడియా, సోషల్ మీడియా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అసమర్థతతో ప్రజలకు సాగునీరు, తాగునీరు, కరెంట్ కష్టాలు దాపురించాయని, ప్రభుత్వంపై నాలుగు నెలలకే ప్రజలు విసిగెత్తిపోయారని పేర్కొన్నారు.
బస్సు యాత్ర.. రోడ్షోలు
లోక్సభ ఎన్నికల కోసం రోడ్షోలు చేయాలని, బస్సు యాత్రలు చేపట్టాలని యోచిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. 20 లేదంటే 22 నుంచి బస్సు యాత్రలు ప్రారంభించుకుందామని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలుంటాయని, పార్టీకి అనుకూలంగా ఉండే రూట్మ్యాప్ను, ప్రదేశాలను నాయకులే కూర్చొని నిర్ణయించాలని సూచించారు.
రోడ్షోలు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఉంటాయని, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయని తెలిపారు. బస్సుయాత్రలు చేస్తూనే మధ్యలో బహిరంగ సభల్లో కూడా పాల్గొంటానని చెప్పారు. సిద్దిపేట, వరంగల్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని బహిరంగ సభలు ఉంటాయన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేయాలని కోరారు. 42 లక్షలమంది పెన్షనర్లకు రూ. 4 వేలు ఇస్తామన్న హామీ ఇంతవరకు అమలు కాలేదని, ఒక నెల పింఛను ఎగ్గొట్టారని మండిపడ్డారు.
కల్యాణలక్ష్మి కింద ఇచ్చే లక్ష రూపాయలకు అదనంగా తులం బంగారం ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని, ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ ఉంటే గిట్లనే ఉండేదా? అని వివరించి చెప్పాలని కోరారు. కరెంటు కోతలు, ఖాళీ బిందెలతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, ఇవన్నీ ప్రజలకు వివరిస్తే మనం బ్రహ్మాండంగా గెలుస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
ఉద్యోగులు కూడా సంతోషంగా లేరు
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా సంతోషంగా లేరని కేసీఆర్ పేర్కొన్నారు. వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడంలేదని, నాలుగు డీఏలు రావాల్సి ఉన్నప్పటికీ ఇవ్వలేదని తెలిపారు. ఒకటి రెండు నెలలు ఒకటో తారీఖున జీతాలు ఇచ్చారని, ఆ తరవాత అది కూడా లేదని విమర్శించారు.
అంబేద్కర్ను అవమానించారు
అంబేద్కర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని, హైదరాబాద్లోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూల దండ వేయలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. అంబేద్కర్ జయంతినాడు కనీ సం గేట్లు కూడా తీయకుండా అవమానించారని పేర్కొన్నారు. అక్కడ నివాళులు అర్పించడానికి, విగ్రహాన్ని చూడడానికి ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారిని లోనికి కూడా పంపలేదన్నారు. ఇదేనా అంబేద్కర్కు ఇచ్చే గౌరవమని ప్రశ్నించారు. అంబేద్కర్కు పూలమాల వేయనోళ్లు, అంబేద్కర్ పేరు మీద ఉన్న సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారని నిలదీశారు.
కడియం ఓటమి ఖాయం
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీని వీడడం వల్ల పార్టీకి లాభమే జరిగిందని, ఆయన పార్టీని మోసం చేసి వెళ్లిపోయాడని కేసీఆర్ పేర్కొన్నారు. మోసం చేసి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి తన కూతురుకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇప్పించుకున్నాడని, వరంగల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని, అక్కడ గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని జోస్యం చెప్పారు. ‘కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని రకాల పదవులు ఇచ్చిండు. ఎంపీ టికెట్ కూడా ఇచ్చాడు కానీ, కాంగ్రెస్లోకి పోయాడు. ఏం తక్కువ చేసిండని పోయిండు ’ అని వరంగల్ ప్రజలు తిట్టుకుంటున్నారని చెప్పారు. వరంగల్ సీటును బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నదని, పార్టీ ఫస్ట్ గెలిచే సీటు అదేనని, సుధీర్ గెలవబోతున్నాడని పేర్కొన్నారు.
8 సీట్లు గెలుస్తున్నాం
సీ ప్యాక్ ఓటర్ సర్వే ప్రకారం 8 సీట్లు పక్కాగా గెలవబోతున్నట్టు కేసీఆర్ పార్టీ నేతలతో చెప్పారు. కొంచెం కష్టపడితే మరో మూడు స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతున్నదని, ఎన్నికలకు నెల రోజులు ఉందని, ఓటర్ల అభిప్రాయాలు మారుతుంటాయని, మారే పరిస్థితులు బీఆర్ఎస్కే అనుకూలమని చెప్పారు. తెలంగాణకు బీఆర్ఎస్ నిజమైన రక్ష అని, బీఆర్ఎస్ ఎంపీలు గెలవకపోతే అడిగేవాడు ఉండడు, ప్రశ్నించే వాడు ఉండరని అన్నారు. ఈ విషయాలను తాను చెప్పడంలేదని, సర్వే సంస్థలే చెబుతున్నాయని తెలిపారు.
ఆరు గ్యారెంటీలకు మంగళం
కాంగ్రెస్కు మళ్లీ ఓటేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు మంగళం పాడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. హామీలు అమలు చేయకపోయినా ప్రజలు తమకు ఓటేశారని, ఆరు గ్యారెంటీలను ప్రజలు పట్టించుకోలేదని ఆ పార్టీ సూత్రీకరిస్తుందని కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు. ఆ పార్టీతో గ్యారెంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్కు ఓటేయాలని చెప్పారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే ప్రధాన ప్రతిపక్షంగా నిలబడి కాంగ్రెస్ మెడలు వంచి ఇచ్చిన హామీలను అమలు చేయిస్తుందని పేర్కొన్నారు.
నాయకులు పార్టీ మారినా ఢోకాలేదు
కొందరు నేతలు వీడినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదని, 2006 కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికలప్పుడు చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధ్యక్షులు రాత్రికిరాత్రి కాంగ్రెస్లోకి వెళ్లారని, ఆ దెబ్బతో కారు గుర్తుకు ఓట్లుపడవని అంతా అనుకున్నారని, కానీ పోలింగ్ తర్వాత చూస్తే ఆ నాలుగు మండలాల పరిధిలో ప్రజలంతా కారు గుర్తుకే ఓటేశారని, బ్రహ్మండమైన మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ అపూర్వమైన ఓట్లు, సీట్లు సాధిస్తుందని చెప్పారు.
ఏం చేసిందని బీజేపీకి ఓటెయ్యాలి?
దేశానికి, రాష్ర్టానికి బీజేపీ ఏం చేసిందని ఓటెయ్యాలని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువకులు.. ఎవరికి ఏం చేసిందని ఆ పార్టీకి ఓటెయ్యాలని నిలదీశారు. ‘మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు.. నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. ఐటీఐఆర్ ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. వారికి ఓటు అడిగే హక్కు లేదు. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లించుకుపోతున్నందుకా?, కృష్ణానది మీద ప్రాజెక్టులు కట్టి కేఆర్ఎంబీకి అప్పగించినందుకా? ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినందుకా? తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టుమన్నందుకా? బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
రైతు సమస్యలే మన ఎజెండా
బీఆర్ఎస్ పార్టీ తొలి నుంచి రైతుల పక్షమేనని, రైతు సమస్యలే మన ఎజెండా అని కేసీఆర్ పేర్కొన్నారు. రైతు సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి నియోజకవర్గంలో 200 మంది రైతులతో పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టాలని సూచించారు.
‘కాంగ్రెస్ చెప్పిన రైతు భరోసా రూ.15వేలు ఇయ్యలేదు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు కాలేదు. రైతుకూలీలకు రూ.12వేలు ఇవ్వలేదు. రూ.500 బోనస్ ఇవ్వలేదు’ వీటన్నంటిని రైతులకు గుర్తుచేయాలి. పంటలు ఎండిపోతుంటే కనీసం పరిశీలించలేదు. కాంగ్రెస్ చేతకాని పనితీరు వల్ల రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందడం లేదు. కాళేశ్వరాన్ని ఉపయోగించుకొని ఉండి ఉంటే రైతులకు సాగు నీరు ఇబ్బంది వచ్చేది కాదు.
మిషన్ భగీరథను ఉపయోగించుకొని ఉంటే తాగునీటికి సమస్యే వచ్చేది కాదు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం కట్టి మరమ్మతులు చేసి నీటిని లిఫ్ట్ చేసి ఉంటే పంటలు ఎండిపోయేవి కావు. రైతులు ధర్నాలు, ఆందోళన చేయడంతో కొంత దిగివచ్చారు. కాఫర్ డ్యాంను కట్టి నీళ్లను లిఫ్ట్ చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించాం. 50వేల మంది రైతులతో పోయి మోటార్లు ఆన్ చేస్తామని అనడంతో ప్రభుత్వం స్పందించింది. మొదలే స్పందించి ఉంటే రైతులకు ఇంత నష్టం జరగకపోయేది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారుకాదు. పెట్టుబడి నష్టం జరిగేది కాదు. పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నది.
హైదరాబాద్లో అయితే ట్యాంకర్లు కూడా దొరకడంలేదు. సిద్ధంగా ఉన్న వ్యవస్థలను కూడా ప్రభుత్వానికి వాడుకోవస్తలేదు’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
లీగల్ సెల్కు నిధులు
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ కేసులు బనాయించి కార్యకర్తల మనో ైస్థెర్యాన్ని దెబ్బ తీయాలనుకున్న కాంగ్రెస్ పార్టీపై పోరాడేందుకు లీగల్సెల్ను ఇప్పటికే పటిష్టం చేసినట్టు చెప్పారు. కేసులను ఎదురొనేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా కార్యకర్తలకు కాపాడుకుంటామని, ఇందుకోసం పది కోట్ల రూపాయలను బీఆర్ఎస్ లీగల్సెల్ అకౌంట్కు కేటాయిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులోఎటువంటి న్యాయపరమైన సేవలైనా అందించేందుకు పార్టీ సీనియర్ అడ్వకేట్లు సోమా భరత్కుమార్, మోహన్రావుతో కూడిన అడ్వకేట్ల బృందం నిరంతరం అందుబాటులో ఉంటుందని చెప్పారు.
కవిత కేసులో పసలేదు
ఎమ్మెల్సీ కవిత కేసులో ఎలాంటి పసలేదని, ఆమె ఏ తప్పూ చేయలేదని కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్ ఉన్నాడని, అప్పుడు ఆయనను అరెస్ట్ చేయడానికి మన పోలీసులు చాలా ప్రయత్నం చేశారని తెలిపారు. ఆ కక్షతోనే కవిత అరెస్టుకు ఆయన పట్టుబట్టారని ఆరోపించారు. సంతోష్ మొదటి నుంచీ ఆరెస్సెస్ మనిషి కాబట్టి, ఆయన చెప్పినట్టుగా ప్రధానమంత్రి మోదీ, అమిత్షా విన్నారని, ఆయన ఒత్తిడికి తలొగ్గి కవితను అరెస్ట్ చేశారని విమర్శించారు. ఉద్దేశ పూర్వకంగా జరిగిన అరెస్ట్ తప్ప వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు.
ఇంద్రవెల్లి మారణకాండకు, అక్కడ కాల్పులకు కాంగ్రెస్సే కారణం. ఇప్పుడేమో రేవంత్రెడ్డి అక్కడికిపోయి పూలు జల్లుతున్నరు.
– కేసీఆర్
తెలంగాణ అమరులకు రేవంత్రెడ్డి ఇప్పటి వరకు ఒక్క దండ కూడా వేయలే. ఏనాడూ జై తెలంగాణ అనని వ్యక్తి సీఎం సీట్లో ఉన్నడు. తెలంగాణ వ్యతిరేకి ముఖ్యమంత్రి అయిండు. జై తెలంగాణ అనని వ్యక్తి సీఎం సీట్లో ఉండటానికి అనర్హుడు.
– కేసీఆర్