KCR : ఎన్నికల్లో గెలిచినా, ఓడినా నాయకుడు ప్రజల కోసమే పని చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశామని, రైతులు జీవితాలను బాగుచేశామని చెప్పారు. రాష్ట్రంలో పంటలు బ్రహ్మాండంగా పండాయని అన్నారు. పంట దిగుబడిలో హర్యానా రాష్ట్రాన్నే తలదన్నే స్థాయికి చేరామని అన్నారు.
‘వ్యవసాయాన్ని స్థిరీకరించాలని, రైతు బాగుండాలని ఓ ఐదు కార్యక్రమాలు తీసుకున్నం. అందులో మొదటిది రైతుబంధు పథకం. ప్రపంచంలో తొలిసారి రైతుబంధు అనే పథకాన్ని సృష్టించింది మనమే. రెండోది కరెంటు. నిమిషం కూడా పోకుండా కరెంటు ఇచ్చినం. మూడోది చెరువులు బాగు చేసి సాగు నీళ్లు ఇచ్చినం. నాలుగోది రైతు చనిపోతే ఆయన కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఇచ్చే ఏర్పాటు చేసినం. ఇక ఐదోది రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినం. 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడి పంటలు అక్కడే కొనుగోలు చేసినం. దాంతో 54 లక్షల టన్నుల పంట పండించే తెలంగాణ రాష్ట్రం మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి ఎదిగింది. హర్యానా రాష్ట్రాన్నే తలదన్నే స్థాయికి పోయినం. అట్ల బ్రహ్మాండంగా పంటలు పండినయ్. దాంతో రైతుల్లో ఒక ధీమా వచ్చింది’ అని కేసీఆర్ తెలిపారు.
‘సంక్షేమం రంగంలో కూడా అందరినీ ఆదుకున్నం. అదేవిధంగా దళితబంధు పథకం పెట్టినం. హుజూరాబాద్లోనే పైలట్ ప్రాజెక్టుగా పెట్టి బ్రహ్మాండంగా రైతుబంధు పథకాన్ని అమలు చేసినం. అది మీ నియోజకవర్గం అదృష్టం. ఇయ్యాల దళితబిడ్డలు బ్రహ్మండంగా తలెత్తుకుని బతుకుతున్నరు. పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినం. అవుతలోని మాటలు నమ్మి మనం ఓట్లేసి గెలిపించినం. ఇవుతలోని కంటే అవుతలోడు ఓ రూపాయి ఎక్కువ ఇస్తనంటే ఆశ పడుడు మనకు అలవాటు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
‘గెల్లు శ్రీనివాస్ నాతోపాటు ఉద్యమంలో కొట్లాడిండు. అప్పట్లో కౌశిక్రెడ్డికి నచ్చజెప్పి ఉపఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ను పోటీకి నిలబెట్టిన. దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ ఓడిపోయారు. తర్వాత కౌశిక్రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ ఇచ్చిన. అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్రెడ్డిని నిలబెడితే గెలిపించి నాకు తిరిగిచ్చిండ్రు. అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోయినం. గెలుపు, ఓటములు సహజం. ఓడినా గెలిచినా ప్రజల కోసం పనిచేయాలి. దటీజ్ పాలిటిక్స్. గెలిచినా ఓడినా నాయకుడు ప్రజల కోసమే పనిచేయలె’ అని కేసీఆర్ అన్నారు.