KCR | బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీయే తప్పా.. అది పేదల పార్టీ కాదని.. వారికి ఏ మాత్రం లాభం చేయదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ మాట్లాడుతూ.. ‘కామారెడ్డి జిల్లా ఉండాల్నా? పోవాల్నా..? ఉండాలా? మరి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసేస్తా అంటున్నడు. మరి మీ ఇష్టం. కాపాడుకుంటరా? పోడగొట్టుకుంటరా? కామారెడ్డి జిల్లా ఉండాలంటే.. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గాలి అనిల్కుమార్ గెలవాలి. మన భవిష్యత్ కోసం వీళ్లైతేనే కొట్లాడుతరు’ అన్నారు.
‘నరేంద్ర మోదీ ఈ దేశ ప్రధానిగా పది సంవత్సరాలుగా పని చేస్తున్నడు. 150 హామీలు ఇచ్చిండు. ఒక్క హామీ నెరవేరిందా? సబ్కా సాత్.. సబ్కా వికాస్ జరిగిందా? సబ్ కా సత్యనాశ్ అయ్యింది. దేశం దెబ్బతిన్నది. రూపాయి విలువ డాలర్తో చూసుకుంటే రూ.84 అయ్యింది. ఎగుమతులు బంద్ అయ్యాయి. దిగుమతులు పెరిగాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మేకిన్ ఇండియా అన్నడు.. ఏమైనా జరిగిందా? డిజిటల్ ఇండియా అన్నడు.. ఏమన్నా జరిగిందా..? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? అచ్చేదిన్ వచ్చిందా? అచ్చేదిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది. జన్ధన్ యోజనతో ఎవరికైనా లాభం జరిగిందా? కామారెడ్డి వాళ్లకు బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించారని.. భారతదేశమంతా రూ.15లక్షలు.. మీకు మోదీ రూ.30లక్షల వచ్చినయట? మరి వచ్చినయా? రాలేదా? రూ.15లక్షలు రాలేదు.. రూ.30లక్షలు రాలేదా? ఎవరికీ ఏం జరుగలేదు’ అన్నారు.
‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నడు. మరి జరిగిందా? ఇలా ఇష్టం వచ్చినట్లు.. నోటికి వచ్చినట్లు 150 వాగ్ధానాలు చెప్పిండు. ఒక్కటి కూడా అమలు కాలేదు. దేశ ప్రతిష్ట మంటగలిసింది. రూపాయి విలువ పడిపోయింది. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది వాస్తవం. మనకు రావాల్సిన నవోదయ పాఠశాలలు రాలేదు. రావాల్సిన మెడికల్ కాలేజీ రాలేదు. మన ఏడు మండలాలు ఆంధ్రాకు అప్పగించాడు. మన సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పగించాడు. తెలంగాణకు ఏ నాడు ఒక్క మంచి పని నరేంద్ర మోదీ చేయలేదు. పైగా తల్లిని చంపి బిడ్డను బతికించారని అంటడు. తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి.. బిడ్డను బతికించారని ఓ దిక్కుమాలిన మాట మాట్లాడుతడు. మొన్న ఉత్తర భారతదేశంలో అదే మాటమాట్లాడిండు. అది కూడా పూరా ఝూటా. ఈ రకంగా బీజేపీ పరిపాలన మనకు ఏరకమైన మంచి చేయలేదు’ అన్నారు.
‘మనకు ఉన్న రెండు నదులను కృష్ణా, గోదావరి నదిని తీసుకుపోయి వేరేవాళ్లకు ఇస్తా అని చెబుతడు. బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారుల పార్టీ. పెట్టుబడిదారుల పార్టీ తప్ప.. అది పేద ప్రజల పార్టీ కాదు. అది పేదలకు ఏమాత్రం లాభం చేయదు. ఈడ కాదు భారతదేశం నలుమూలలా ఎక్కడ మంచి చేసిన దాఖలా లేదు. ఎంతసేపు మతవిద్వేషం పెట్టాలి. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, గందరగోళం చేసుడే తప్ప.. ఏ ఒక్క మంచి పని ప్రజలకు జరిగిన పరిస్థితి లేదు. అందువల్ల బీజేపీ పార్టీ పనికాదు. ఓటు వేసిన వేస్టే తప్ప.. నదుల్లో నీళ్లపోతయ్ తప్ప.. మనకు ఏం లాభం జరుగదు’ అన్నారు.