KCR | ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన అనంతరం.. సిరిసిల్లలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతులు బ్యాంకులకు ఉరుకుండ్రి.. డిసెంబర్ 9 నాడు సంతకం చేస్తా.. 2 లక్షల రుణమాఫీ చేస్తా.. అని రేవంత్ రెడ్డి చెప్పిండు అని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ హామీ ఎక్కడికిపోయిందని.. డిసెంబర్ 9న వెళ్లి ఎన్ని రోజులు అయ్యిందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతుందని.. ఇంకా దాని మీద ఊసే లేనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ఇవాళ బ్యాంకులు వచ్చి రైతులకు నోటీసులు ఇస్తున్నారని.. వాళ్లను అడిగితే తమకు సంబంధం లేదని.. రాజకీయంగా ఇలాంటి మస్త్ ప్రకటనలు చేస్తారని.. తమకు డబ్బులొస్తేనే లెక్క అని బ్యాంకర్లు చెబుతున్నారని అన్నారు. మీ పాగల్ పని వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితి వచ్చిందని.. అయినా కూడా రైతు రుణమాఫీ మీద ఉలుకు పలుకు లేదని మండిపడ్డారు. దీనికి ఎవరు జవాబుదారీ అని మండిపడ్డారు. బ్యాంకులు నోటీసులిస్తుంటే ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అంశాన్ని వెంటనే తేల్చాలని.. లేదంటే మిమ్మల్ని వేటాడుతాం.. వెంటాడుతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
‘అన్ని పంటలు కొంటాం.. అన్నింటికీ బోనస్లు ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇవాళ జొన్న పంటను సగమే కొంటామని అంటున్నారు. జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంటను ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తున్నా. వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇవ్వలేదు. క్వింటాల్కు 500 ఇస్తామని చెప్పి ఇయ్యలే. ఇవాళ కొనుగోలు కేంద్రాలు పెట్టినమని చెప్పిండ్రు.. కానీ బోనస్ ఇస్తారా? లేదా? అనేదాని మీద ఉలుకులేదు.. పలుకు లేదు. ఇవ్వకపోతే మిమ్మల్ని వెంటాడుతాం.
ఇదే రిఫరెండం అనుకుని ఓటేయమని మీరే చెప్పిండ్రు కదా.. మీ సంగతేంటో ప్రజలు చూపిస్తారు. బోనస్ ఇవ్వకపోతే.. బోగస్ అని మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెబుతారు. కర్రు కాల్చి వాత పెడతరు.’ అని కేసీఆర్ హెచ్చరించారు. బోనస్కు ఎలక్షన్ కోడ్ అడ్డురాదని చెప్పారు. ‘ మీకు చిత్తశుద్ధి ఉంటే. బోనస్ ఇస్తామని మాట ఇచ్చామని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయాలి. ఎన్నికల సంఘాన్ని పర్మిషన్ అడగాలి. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే ఏ రైతుకు ఎంత బోనస్ రావాలని లెక్క చేసి.. 13న ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత ఇవ్వండి.’ వివరించారు. బోనస్ ఇచ్చేదాకా వదిలిపెట్టమని.. బీఆర్ఎస్ వెంటాడుతుందని హెచ్చరించారు. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.