KCR | ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ మిలాఖత్ కాకపోతే వెంటనే ఆర్ ట్యాక్స్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కం ట్యాక్స్ను విచారణ కోసం రంగంలోకి దించాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. బస్యాత్ర మంగళవారం కొత్తగూడెం చేరుకున్నది. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఇవాళ నరేంద్ర మోదీ మన తెలంగాణకు వచ్చిండు. ఆందోల్లో ఒక సభలో మాట్లాడిండు. రేవంత్రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నడని మాట్లాడుతున్నడు. అది నిజమే అయితే.. మీ ఇద్దరు మిలాఖత్ కాకపోతే ముఖ్యమంత్రిపై వెంటనే విచారణ ఆదేశించాలి. వెంటనే ఈడీని దించు. ఐటీని దించు. ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతుందో పట్టుకో. అదిచేతకాదు నరేంద్ర మోదీ. మీదికి నాటకాలు ఆడతారు కానీ.. ఖచ్చితంగా ఇవాళ ఇద్దరూ ఒక్కటే. ఎవరికి ఓటు వేసినా గోదావరిలో పారేసినట్లే తప్పా.. మన రాష్ట్రానికి వచ్చిన లాభం ఏమీ లేదు’ అంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘మీ బిడ్డగా.. ఆ నాడు తెలంగాణ రాష్ట్రం తెస్తా అని చెప్పిన. ఇదే కొత్తగూడానికి నేను చాలాసార్లు వచ్చిన. వందలాది సభలు పెట్టినం. ఆ నాడు నా వెంట ఎవరూ లేకపోయినా.. నా ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన. తెచ్చిన తెలంగాణలో కులం, మతం, ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని బ్రహ్మాండంగా తీసుకొనిపోయాం. శాంతిభద్రతలు అద్భుతంగా ఉండేవి. ఏ ఒక్కనాడు హిందువులు, ముస్లింల మధ్య కొట్లాటలు జరుగలేదు. ఏ రకమైన అలజడి జరుగలేదు. కానీ ఈ రోజు మాట్లాడితే హిందువు ముస్లిం అని మాట్లాడుకుంటూ ప్రజల్లో విద్వేషం నింపుకుంటూ ఘోరమైన కార్యక్రమాలు చేస్తున్నరు. అందకే మీ అందరిని ప్రార్థించేది. దయచేసి.. ముఖ్యంగా.. విద్యావంతులు, విద్యార్థులు, మేధావుల నా మాటలపై చర్చ చేయాలి. నేను చెప్పేది నిజమా కాదా?.. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ? ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా’నన్నారు.
‘సోదరులారా అందరూ అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. చాలా ఆవేశపూరితమైన స్వాగతం పలికారు. ఖచ్చితంగా ఈ చారిత్రక సందర్భంలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే.. తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకు దక్కుతయ్. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వస్తయ్. కాబట్టి ఈ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి కవితను.. ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్రావును గెలిపించాలని కోరుతున్నా. ఇందాక ఖమ్మం నుంచి కొత్తగూడెం వస్తుంటే.. కార్లు, ట్రాక్టర్లు, జీపులు, ఆటోలో పోయేవారంతా అందరూ జై కేసీఆర్ అని విక్టరీ సింబల్ చూపిస్తున్నరు. కాంగ్రెస్ కథ అయిపోయింది. బీజేపీ కథ కూడా అయిపోయింది. బ్రహ్మాండమైన మెజారిటీతో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల హక్కుల గురించి పోరాడుతూనే ఉంటా’నని కేసీఆర్ స్పష్టం చేశారు.