KCR | కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఆనవాళ్లు అన్నింటినీ తీసేస్తాం అని ముఖ్యమంత్రి అంటున్నారు? తీసేయగలరా.. అది సాధ్యమా? అని ఆయన ప్రశ్నించారు. ఓ మీడియా ఛానల్లో బిగ్ డిబేట్లో పాల్గొన్న ఆయన.. మీరు కూర్చుంటున్న సెక్రటేరియట్ కేసీఆర్ ఆనవాళ్లు కాదా అని రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.
మీ ఎమ్మెల్యేలు ఉంటున్న క్వార్టర్లు కేసీఆర్ కట్టినవే కదా? యాదాద్రి దేవాలయం కట్టింది కేసీఆరే.. దానికే పూజకు పోయినవ్ కదా? యాదాద్రి దేవాలయం కూలగొడతావా? పాలమూరు ఎత్తిపోతల పథకం బంద్ పెడతవా? సీతమ్మ సాగర్ ప్రాజెక్టు బంద్ పెడతవా? కేసీఆర్ సమ్మక్క బ్యారేజి కట్టిండు దాన్ని కూలగొడతవా? ఏది బంద్ పెడతవ్ అని ప్రశ్నించారు. ఒకవేళ ఆనవాళ్లు తీసేయాలంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ఠ అవుతుందని స్పష్టం చేశారు.’ కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. హీ మేడ్ హిస్టరీ. ఐ బాట్ తెలంగాణ. ఐ రూల్డ్ తెలంగాణ ఫర్ టెన్ లాంగ్ ఇయర్స్. హౌ కెన్ యూ డూ దట్.’ అని నిలదీశారు.
పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం కట్టినం. దాన్ని కూలగొడతవా? అది కేసీఆర్ ఆనవాళ్ల కింద ఉండదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. 1100 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినం తీసేస్తవా? 33 కొత్త జిల్లాలు పెట్టిన తీసేస్తవా? మూడు నాలుగు వందల కొత్త మండలాలు చేసినం.. తీసేస్తావా? వాట్ ఈజ్ దట్ యూ గోయింగ్ టు డూ? అని అడిగారు. తండాలను గ్రామ పంచాయతీలుగా కేసీఆర్ చేసిండు.. తీసేస్తవా? కేసీఆర్ ఆనవాళ్లు ఏది తీసేస్తావ్. కేసీఆర్ ఆనవాళ్లు తీసేయాలంటే.. తెలంగాణనే తీసేయాలని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డికి తన మీద ఉన్నది కోపం అని అనుకోవడం లేదని.. అది ఒక రకమైన అజ్ఞానమని కేసీఆర్ తెలిపారు. ‘ తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్రాన్ని ఆగం చేయాలని అనుకున్నారు. కొంతమంది ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేయాలని అనుకున్నారు. ఆ ప్రయత్నంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు అనే విచిత్ర కథ తీసుకొచ్చారు. తెలంగాణ పాలకులు తమ ఓటును కూడా తాము వేయించుకోలేకపోతున్నారని దుష్ప్రచారం చేయాలని చూశారు. అందులో ఈయన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దోషి. 50 లక్షలను స్టీఫెన్ సన్ అనే ఎమ్మెల్యేకు ఇస్తూ దొరికిన దోషి.’ అని అన్నారు. అదే కక్షగా పెట్టుకుని రేవంత్ రెడ్డి ఇదంతా చేశారని అభిప్రాయపడ్డారు.