KCR | ఇప్పుడు ప్రజల చేతిలోకి ఒక అంకుశం కావాలని.. ఒక హంటర్ కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పనిచేయించే అంకుశం అవసరం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు. అలాంటి అంకుశంలో ఓ పదునైన మొనదేలినటువంటి అంకుశం చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అని ఆయన పేర్కొన్నారు. ఆయన అనుభవం ఉన్న వ్యక్తి, బలహీనవర్గాల వ్యక్తి అని అన్నారు. చేవెళ్లలో శనివారం నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ పనులు చేయించాలంటే తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరాలంటే.. బలమైన ప్రతిపక్షం ఉండాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ‘ లేదంటే.. ఐదు నెలల కింద అడ్డగోలు మాటలు చెప్పినం.. అన్ని పంగనామాలు పెట్టినం.. ఏ పాలసీ సరిగ్గా లేదు.. ఉన్నది కూడా ఊడగొడుతున్నాం. కరెంటు సక్కగా ఇస్తలేం.. రైతుబంధు కూడా సక్కగా ఇయ్యలే.. పంటలు కొంటలే.. 500 బోనస్ ఇస్తలేం అయినా మాకే ఓటేసిండ్రు. మేం ఏం చేయకున్నా ఏమీ అనరు అనే అభిప్రాయం వస్తది. తస్మాత్ జాగ్రత్త.’ అని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం మీకిచ్చిన వాగ్ధానాలు నెరవేరాలంటే.. ఓటు వేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే.. ప్రభుత్వానికి మీరు ఒక సురుకు పెడితేనే మీ అన్ని పనులు అయితాయని అన్నారు. ‘ లేదంటే.. మేం ఏం చేయకున్నా, మోసం చేసినా, అబద్ధపు వాగ్దానాలు చేసినా మళ్లీ మమ్మల్ని గెలిపించిండ్రు అని అంటరు. ఎల్లెలకల పంటరు.. మీకేం చేయరు.’ అని పేర్కొన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలవాలని.. అంకుశంలా పనిచేయాలని పేర్కొన్నారు. అప్పుడే ప్రజల కార్యక్రమాలు నెరవేరతాయని అన్నారు.
అన్ని పంటలు కొంటామని.. బోనస్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ వానకాలం పంటలకు బోనస్ ఇవ్వలేదు.. ఇప్పుడు యాసంగి కొనుగోళ్లు కూడా స్టార్ట్ అయినయని అన్నారు. బోనస్ ఇస్తరా? ఇవ్వరా? ఇవ్వకుంటే ఊరుకుందామా? యుద్ధం చేద్దామా? అని ప్రశ్నించారు. యుద్ధం రెండు రకాలుగా చేయాలని సూచించారు. ముందు పంట కొనుగోలు కేంద్రాల దగ్గర చేయాలి.. అక్కడ స్పందన రాకపోతే, 500 బోనస్ కట్టి ఇవ్వకపోతే.. ఓట్ల డబ్బాలో గుద్దుడు గుద్దితే డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాని పిలుపునిచ్చారు. బిడ్డ నువ్వు ఇస్తామని మోసం చేస్తే ఊరుకోమని అన్నారు. మీకు తగిన గుణపాఠం చెబుతామని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు 420 వాగ్ధానాలు చేశారని కేసీఆర్ అన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు.. స్కూటీలు ఎక్కడికి పోయాయి. దాని ప్రతిపాదన ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తున్నారని మండిపడ్డారు. భయంకరమైన లూటీ మొదలుపెట్టిండ్రని విమర్శించారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్తో సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు, అలాగే యావత్ తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండె.. ఇప్పుడు ఎట్లున్నయని ఆయన అడిగారు. ఉన్నట్టుండి రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న బ్రోకర్లు ఎవరు? జోకర్లు ఎవరు? అని నిలదీశారు. ఎందుకు బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తలేరని ప్రశ్నించారు. లక్షలమంది పిల్లలు బతికిన రియల్ ఎస్టేట్ ఎందుకు నాశనమైందని అన్నారు. ఇట్లే చూసుకుంటూ ఉందమా? మేం ఉన్నామని నిరూపించుకోవడానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధిచెబుతామా? అని ప్రజలను అడిగారు.