KCR | హైదరాబాద్ : ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు 14 సీట్లు గెలిపిస్తే.. తెలంగాణ తడాఖా ఏందో దేశ రాజకీయాల్లో చూపిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
బీఆర్ఎస్ 12 లేదా 14 సీట్లు సాధిస్తుంది. ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్ కనీసం 9 స్థానాల్లో మూడో స్థానంలో ఉంది. బీజేపీ సెకండ్ ఉన్నా తమతో దూరంగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. గోదావరి జలాలు దక్కించుకోవాలంటే, తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే ఈ కీలక సమయంలో కేంద్రంలో మనం కీలకంగా మారాలి. 14 సీట్లు గెలిస్తే తెలంగాణ తడాఖా ఏందో దేశ రాజకీయాల్లో చూపిస్తాను. ఇది మా తెలంగాణ అని తలెత్తుకునే విధంగా దేశ రాజకీయాలను శాసిస్తాం. ఒక ఒరవడిలో కాకుండా.. స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకని బీఆర్ఎస్నే గెలిపించాలి. బీఆర్ఎస్ ఇంటి పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. బీజేపీకి ఓటేస్తే అశాంతి అజడి తప్ప ఏం రాదు. అదో పిచ్చి పార్టీ. ఢిల్లీ గులామ్లు గెలిచి సాధించేది ఏం లేదు. కాంగ్రెసోళ్లు కూడా ఏం చేయరు. ఢిల్లీ గులామ్ల కంటే తెలంగాణోళ్లు గెలిస్తేనే బెటర్. తమిళనాడు మనకు ఆదర్శం. తమిళనాడు ద్రవిడ పార్టీలను గెలిపిస్తరు కానీ బయటి పార్టీలను గెలపించరు. ఈ రెండు పార్టీలను ఖతం చేయాలి అని కేసీఆర్ కోరారు.
కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బస్సు యాత్రను విజయవంతం చేశారు. ఒక్కటే మాట మనవి చేస్తున్నా.. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు నమ్మకం లేదు. 14 ఏండ్లు అద్భుతంగా పురోగమిచం రాష్ట్రాన్ని సాధించాను. ఆ తర్వాత పదేండ్లు పూల పొదరిట్టు మాదిరిగా అందర్నీ గౌరవిస్తూ నీట్ గా ఉండే తెలంగాణను తయారు చేశాను. తలసరి ఆదాయం పెంచాను. మౌలిక సమస్యలు తీర్చాను. ఈ రోజు అనుకోకుండా మొన్న ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది. ప్రజల తీర్పు శిరోధార్యం. ప్రతిపక్ష పాత్ర తప్పకుండా పోషిస్తాం అని కేసీఆర్ పేర్కొన్నారు.