‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ … అంటూ తెలంగాణ గరిమను, తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప తెలంగాణ కవి, దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. దాశరథి శత జయంతి సందర్భంగా (జులై 22) వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. కవిగా, రచయితగా, తెలంగాణ అస్మితను, తన ప్రాంత ప్రజల కష్టాలను, ప్రపంచానికి వినిపించిన తెలంగాణ గర్వించదగ్గ భూమి పుత్రుడు దాశరథి అని కేసీఆర్ అన్నారు.
అన్నార్తులు, పీడితులు దుఃఖితుల కోసం తన కలాన్ని అందించిన దాశరథి కృష్ణమాచార్య కృషిని రేపటి తరాలు గుర్తు చేసుకునేలా, వారి పేరున అవార్డును నెలకొల్పి ప్రతీయేటా వారి జయంతి రోజున లబ్ద ప్రతిష్టులైన సాహిత్యకారులకు అందించాలని, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించి అమలు చేసిందని కేసీఆర్ అన్నారు. జైలు గోడల నడుమ నిర్భంధంలోనూ తెలంగాణ నినాదాన్ని వినిపించిన దాశరథి స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా మాత్రమే వారికి మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ తెలిపారు.