KCR | బీఆర్ఎస్ రాజీలేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా గురువారం అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన అనంతరం.. హైదరాబాద్ నందినగర్ నివాసానికి వెళ్లారు. అక్కడే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ గురించి పార్టీ నేతలకు అధినేత దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు.
తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించామని కేసీఆర్ అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని పునరుద్ఘాటించారు.