Pilot Rohith Reddy | పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై వారం రోజుల్లోగా స్పష్టంగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. షోకాజు నోటీసుకు గడువులోపు వివరణ సమర్పించకపోతే.. పార్టీ నియమావళి ప్రకారం వేటు వేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ కుమార్ షోకాజ్ నోటీసు జారీ చేశారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సమావేశంలో హాజరైన సమయంలో, అక్కడ మాదక ద్రవ్యాలు వినిగియోంచారని వివిధ మీడియా నివేదికలు, ఇతర విశ్వసనీయ సమాచారం ద్వారా పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికి వచ్చిందని షోకాజ్ నోటీసుల్లో తెలిపారు. ఈ వార్తలు విస్తృతంగా మీడియాలో ప్రసారం కావడంతో పాటు పార్టీకి, ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళనలు కలిగించాయని పేర్కొ్న్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసం కలిగిందని నోటీసుల్లో పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదకద్రవ్యాలు, మత్త పదార్థాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండటాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ సంఘటనలో పైలర్ రోహిత్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టాయని అన్నారు. అలాగే పార్టీ ప్రతితష్ట, విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశాలు కల్పించాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశం మేరకు ఈ నోటీసులు అందిన తేదీ నుంచి 7 రోజుల్లోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై జవాబును స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖితపూర్వక వివరణ సమర్పించాల్సిందిగా నోటీసులు ద్వారా ఆదేశిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై పార్టీ నాయకత్వం సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండాల్సిందిగా ఆదేశించారు.
గడువు తేదీలోగా సంతృప్తికరమైన వివరణ సమర్పించకపోతే పార్టీ రాజ్యాంగం, నియమావళి ప్రకారం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే మీపై తగిన క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

Pilot Rohit Reddy