ఒక్కొక్కనాడు ఏడుగురు చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయిర్రు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగ ఉన్నడు. ఒక్క 50 వేలు ఇవ్వాలని వేడుకున్నం. అయినా ఇవ్వలె. మేమే నిజామాబాద్, హైదరాబాద్ అబిడ్స్లో భిక్షాటన చేసిన రూ.7.50 లక్షలు వస్తే తీస్కపోయి భూదాన్పోచంపల్లిలో ఇచ్చినం.
– కేసీఆర్
మా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించి రూ.300 కోట్ల బకాయిలున్నయ్. అవి కూడా ప్రభుత్వం ఇస్తలేదన్నరు. మీరు రండి హైదరాబాద్కు హైకోర్టుల కేసు వేసి ప్రభుత్వాన్ని బజారుకీడ్చుదాం. చేనేత మిత్ర పథకాన్ని కూడా బందు పెట్టిన్రు. వాళ్లు చావాల్నా. ఎక్కడికి పోవాలె.
– కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్5 (నమస్తే తెలంగాణ): ‘చేనేత కార్మికులకు ఆర్డర్లు ఉత్తగ ఏం ఇయ్యలె. ఉపాధి చూపి కార్మికుల ఆత్మహత్యలను నివారించడంతోపాటు, అటు పేదలను కూడా ఆదుకోవాలనేదే లక్ష్యం. ఆ ఆర్డర్లకు సంబంధించి 300 బకాయిలు ఉన్నయ్. అవి కూడా ఇస్తలేరు. అదేమంటే చేనేత కార్మికులు దొబ్బితిన్నరు అనంటరా. ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తే కష్టం చేసిండ్లు. పేదలకు పంపిండ్లు. నిరోధ్లు.. పాపడాలు అమ్ముకుని బతకమంటరా? వాళ్లు మనుషుల్లా కనబడతలేరా? మూడునాలుగు రోజుల్లో ఆర్డర్లు, బకాయిలు రాకుంటే బజారుకీడుస్తం. చేనేత కార్మికులు పులిబిడ్డలై గర్జిస్తరు తస్మాత్ జాగ్రత్త’ అంటూ కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన అనంతరం సిరిసిల్లలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
‘సిరిసిల్ల గంగాధార మండలం పెగడపల్లి మండలం సిరిసిల్ల సిద్దిపేట పోతున్నాం. అప్పుడు జయశంకర్తో కలిసి పోతా ఉంటే గోడల మీద రాతలు కనబడతా ఉన్నాయి. చేనేత కార్మికుల్లారా ఆత్మహత్యలు చేసుకోకండి. చావులు సమస్యలకు పరిష్కారం కాదని, అవి చూసి నేను, నాతో ఉన్న ఉద్యమకారులు కండ్లల నీళ్లు తీస్కున్నరు. 65 ఏండ్ల స్వతంత్రభారతంలో చావకండి అని గోడల మీద రాతలు రాసే ప్రభుత్వాలు ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటదని బాధపడ్డం. తెలంగాణ వచ్చినంక ఎట్లన్న చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని ఆలోచన చేసినం.
ఒకటే రోజు 11 మంది కార్మికులు చనిపోతే మా పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి, ట్రస్టు ఏర్పాటు చేసినం. చావకుండా చూడండి అని బతిమాలినం. ఇప్పటికీ ఆ ట్రస్టు ఉన్నది. మేం చెప్పినం. దయచేసి చచ్చిపోవద్దని కోరినం. తెలంగాణ వస్తది తరువాత బిడ్డల్లా సాదుకుంటమని భరోసా ఇచ్చినం. ఆత్మహత్యలు బందుపెట్టమన్నం. అనుకున్న ప్రకారం తెలంగాణ వచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. భువనగిరిలో, గద్వాలలో, దుబ్బాకలో, సిరిసిల్లలో రోజూ చనిపోయే చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ సర్కార్లో ఒక పద్ధతి ప్రకారం, ఇటు పేదలకు మేలు చేసేలా, చేనేత కార్మికులకు ఉపాధినిచ్చేలా పథకాలు పెట్టినం. రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, స్కూల్ యూనిఫాం, బతుకమ్మ చీరలని పెట్టి కార్మికులకు ఆర్డర్లు ఇచ్చినం. ఇప్పుడే చేనేత కార్మికులు కలిసిన్రు. మళ్లా మాకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పాతకథే తయారైందని బాధపడుతున్నరు.
మనోభావాలు దెబ్బతిస్తారా? మీరు ఇస్తే ఇచ్చిండ్లు. పీకితే పీకిండ్లు.. చాతకాకపోతే ఇయ్యకుండ్రి. కానీ నిరోధ్లు అమ్ముకుని, పాపడాలు అమ్ముకొని బతుకుండ్రి అంటే వాళ్లు మనుషుల్లా కనబడతలేరా? చేనేత కార్మికులు పులులై గర్జిస్తరు బిడ్డా. మిమ్ముల తరిమికొడతరు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్న.
– కేసీఆర్
ఇంకా దీనిమీదికెళ్లి కథ. అదేమంటే రైతుబంధు అడిగితే ఓ మంత్రి చెప్పుతోని కొడతమంటరు. చెప్పుతోని కొడతరా? నేను ఇదివరకే చెప్పిన. రైతులకు కూడా చెప్పులు ఉంటయ్. వారికి తిక్కపుట్టి మర్లేత్తె మీ గతేమైతదో ఆలోచించుకోమని చెప్పిన. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే గతి ఉన్నది. ఆత్మహత్యలు మొదలయ్యేట్లు ఉన్నయ్ అంటే ఇంకో కాంగ్రెసోడు అంటడు. ఏం భయం లేదు. వాళ్లను నిరోధ్లు అమ్ముకుని, పాపడాలు అమ్ముకుని బతకమంటడు. నిరోధ్లు అమ్ముకుని బతకాలా? మీరు మనుషులా?
వెంటనే చేనేత కార్మికుల బకాయిలన్నీ విడుదల చేయండని డిమాండ్ చేస్తున్న. రేపు ధర్నా తరువాత కూడా స్పందించకపోతే, మూడునాలుగు రోజుల్లో ఆర్డర్లు రాకపోతే మా పార్టీ నుంచి వకీళ్ల ఫీజులు ఇచ్చి హైకోర్టులో దావాలు వేస్తాం. కోర్టులకు గుంజుతం. కొట్లాడుతం. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తాం. మిమ్ముల ఫుట్బాల్ ఆడుతాం. ఎంపీ అభ్యర్థినే పెద్ద అడ్వకేట్. మీరే కేసు వేయాలె. ఇంక ఏం మాట్లాడతరు. చేనేత కార్మికులట మొన్నటి వరకు దొబ్బితిన్నరట. దొబ్బితిన్నరా? కష్టం చేసిండ్రు. గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే నేసిండ్రు. ప్రజలకు పంపించిండ్రు. లేని అవ్వలకు, అక్కచెల్లెల్లకు బతుకుమ్మ పేరుమీద, రంజాన్ తోఫా మీద పోయినయ్. అటు పేదలకు అందింది. ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు.
ఇవ్వాళ 14 ఏండ్ల కింద చేనేత కార్మికుల బతుకు ఏం ఉండెనో మళ్లా మూడు నాలుగు నెలల్లోనే ఆ పరిస్థితిని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించి రూ.300 కోట్ల బకాయిలున్నయ్. అవి కూడా ప్రభుత్వం ఇస్తలేదన్నరు. మీరు రండి హైదరాబాద్కు హైకోర్టుల కేసువేసి ప్రభుత్వాన్ని బజారుకీడ్చుదాం. రేపు ధర్నా పెట్టిన్రు. దాదాపు 10 వేల మందితో. అందులో మేము కూడా పాల్గొంటాం. అండగా ఉంటం. ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. చేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలె. అంత నీచంగా మాట్లాడినందుకు. వాళ్లకు వెంటనే ఆర్డర్లు ఇయ్యాలే. తర్వాత వెంటనే పాత బకాయిలు చెల్లించాలి. లేకపోతే ఊరుకోం. లీగల్ బ్యాటిల్ కూడా పోతం.’ అని కేసీఆర్ హెచ్చరించారు.