మోదీ, బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు ఉండవు. ధనికుల బాధలు మాత్రమే ఉంటాయి. అంబానీలు, పెద్దపెద్ద కార్పొరేట్లకు 15లక్షల కోట్లు మాఫీ చేశారు. ఎల్ఐసీ, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులను ప్రైవేటు పరం చేస్తున్నారు. వ్యవసాయం చేసినవాళ్లు, పొలం దున్నిన వారికే రైతుబంధు ఇస్తామంటున్నరు. మేం అందరికీ ఇచ్చాం. నాట్లు వేసేటప్పుడు వెయ్యాల్సిన రైతుబంధును కోతలు, కల్లాలు అయినాక వేస్తారా? ఇంతకుమించి జోక్ ఏమైనా ఉంటదా?
-కేసీఆర్
KCR | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలుచేయలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. రైతుల నుంచి యువకుల వరకు అందరినీ వంచించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో 420 హామీలు ఇచ్చిందని, ఒక్క ఉచిత బస్సు మినహా మరేదీ నెరవేర్చలేదని మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్, దుండిగల్, పటాన్చెరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఐదు నెలల్లోనే రాష్ట్రం ఇంత ఆగమాగం ఎందుకైందని ప్రశ్నించారు.
ఇకపై వ్యవసాయం చేసినవాళ్లు, పొలం దున్నిన వారికే రైతుబంధు ఇస్తామంటున్నారని తెలిపారు. తాము అందరికీ ఇచ్చామని గుర్తుచేశారు. నాట్లు వేసేటప్పుడు వెయ్యాల్సిన రైతుబంధును కోతలు, కల్లాలు అయినాక వేస్తామంటున్నారని, ఇంతకుమించి జోక్ ఏమైనా ఉందా? అని ఎద్దేవా చేశారు. కరెంటు కోతలతో పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అందరం కలిసి కొట్లాడితే తప్ప ఈ ప్రభుత్వం నీళ్లిచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.
అందరినీ వంచించిన కాంగ్రెస్
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్న కేసీఆర్.. అమలు చేస్తున్న ఫ్రీ బస్సు వల్ల మహిళలు సిగలు పట్టుకుంటుంటే, ఆటోకార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రుణమాఫీ ఎందుకు చేయడం లేదని, 9 ఏండ్లు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల విద్యాభరోసా కార్డు, రైతుకూలీలకు ఏడాదికి ఇస్తామన్న రూ. 12,000 ఏమయ్యాయని నిలదీశారు. అన్నింటిలోనూ కాంగ్రెస్ విఫలమైందని ధ్వజమెత్తారు.విద్యార్థులకు ఐదు నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ లేదని, విదేశీ విద్యానిధి స్కాలర్షిప్లు, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, సీఎంఆర్ఎఫ్.. అన్నింటినీ బంద్ పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ చేస్తదన్న నమ్మకంలేదు
నర్సాపూర్కు తాగునీళ్లు రావాలని తాను కోమటిబండ నుంచి ప్రత్యేకంగా లైన్ వేయించానని కేసీఆర్ గుర్తుచేశారు. కాళేశ్వరంతో నర్సాపూర్ లింకు కావాలని శంకరంపేట నుంచి కాల్వలు తవ్వుతున్నారని, మల్లన్నసాగర్ నుంచి ఒకసారి నీళ్లు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తునక అవుతుందని పేర్కొన్నారు. దాన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేస్తదనే నమ్మకం లేదని చెప్పారు. మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్కు నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలని పేర్కొన్నారు.
కొండిపెట్టడం.. తొండిపెట్టడం.. అబద్ధాలు చెప్పడం
నర్సాపూర్ను తాను ఎన్ని రకాలుగా అభివృద్ధి చేశానో అందరికీ తెలుసని కేసీఆర్ పేర్కొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీకి 25 కోట్లు ఇస్తే వాటిని వాపస్ తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి తీసుకున్నారని తెలిపారు. కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు మీద యూనివర్సిటీ పెడదామని అనుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కూడా చేసేలా లేదని విమర్శించారు.
తాము హల్దీవాగు మీద, మంజీరానది మీద 10 చెక్డ్యాంలు కట్టామని, వాటి ద్వారా పంటలు పండించుకున్నామని తెలిపారు. ఇప్పుడు దానిని కూడా దెబ్బతీసే పరిస్థితులు వస్తున్నాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇకపై నెరవేరుస్తుందన్న నమ్మకం కూడా లేదని అనుమానం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం ప్రతి దానికి ఏదో కొండి పెట్టడం, తొండి పెట్టడం, అబద్ధాలు చెప్పడం చేస్తున్నదని మండిపడ్డారు.
మన పొలాలు గోదావరి జలాలతో పారాలె
నర్సాపూర్ అంటే తనకు ఎంతో ప్రేమ అని, సునీతాలక్ష్మారెడ్డి గెలిచినప్పటి నుంచి నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి వచ్చే కాల్వ పూర్తయి, మన పొలాలు గోదావరి జలాలతో పారాలన్నదే తన కల అని తెలిపారు. నర్సాపూర్లో లంబాడా సోదరులు ఎక్కువగా ఉన్నారని, తాను 58 ఏండ్లు మొత్తుకున్నా ఏ ముఖ్యమంత్రీ తండాలను గ్రామ పంచాయతీలు చేయలేదని తెలిపారు. తాను తండాలను గ్రామ పంచాయతీలు చేసి నేరుగా నిధులు ఇచ్చానని గుర్తుచేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కూడా తానేనని వివరించారు. తమ ప్రభుత్వంలో పోడుభూములకు రైతుబంధు, రైతుబీమా ఇచ్చామని గుర్తుచేశారు.
మోదీ ఎజెండాలో పేదల బాధలుండవ్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదేండ్ల క్రితం గద్దెనెక్కి 150 నినాదాలు చెప్పినా ఇప్పటికీ ఏ ఒక్కటీ నిజం కాలేదని కేసీఆర్ విమర్శించారు. ఇప్పుడు మళ్లా 6 చందమామలు, ఏడు సూర్యుళ్లను పెడతామని, ఓట్లేయాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ను చూపించి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ, బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు ఉండవని, ధనికుల బాధలు మాత్రమే ఉంటాయని, అంబానీలు, పెద్దపెద్ద కార్పొరేట్లకు 15లక్షల కోట్లను మాఫీ చేశారని గుర్తుచేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని, ఎల్ఐసీ, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులను కూడా ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ తీరుతో అంతర్జాతీయంగా దేశం పరువు పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పేదల గురించి, గిరిజనుల గురించి, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల గురించి ఏ ఒక్క మంచి చట్టం కూడా తీసుకురాలేదని, కనీస వేతనం పెంచాలని చట్టాలు తేలేదని, కానీ పెట్టుబడిదారులకు మాత్రం కాపాలా కాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, మన హక్కుల కోసం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో పులిబిడ్డల్లా కొట్లాడతారని చెప్పారు.
పదిశాతం రిజర్వేషన్లు నిలబెట్టాలే
టీఎస్పీఎస్సీ గ్రూప్ -1లో పదిశాతం గిరిజన రిజర్వేషన్ అన్యాయమని హైకోర్టు చెప్తే బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీవేసి రిపోర్టు ప్రకారమే చేసిందని ఈ ప్రభుత్వం హైకోర్టులో బలంగా వాదించాలని, కానీ కాంగ్రెస్ కొట్లాడే పరిస్థితిలో లేదని మండిపడ్డారు. మనం పదిశాతం రిజర్వేషన్ మనకే ఉండాలంటే వెంకట్రామిరెడ్డి కచ్చితంగా పార్లమెంటుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు.
పోలీసులు అతిగా ప్రవర్తించవద్దు
పటాన్చెరులో పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని, ఇక్కడ రేపొచ్చేది మళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వమే జాగ్రత్త అని కేసీఆర్ హెచ్చరించారు. లాఠీలకు, తూటాలకు, తుపాకులకు, జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేది కాదని పేర్కొన్నారు. పోలీసులు డ్యూటీలు చేసుకోవాలని, రాజకీయాలు అవసరం లేదని సూచించారు.
అన్నా అంటే నేనున్నాను.. అని వస్తడు
వెంకట్రామిరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారని, ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి అని కేసీఆర్ గుర్తుచేశారు. గెలిస్తే 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటుచేసి పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తానని చెప్పారని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో సొంత నిధులతో కల్యాణమండపం కట్టించి, ఒక్క రూపాయికే పేదలకు లగ్గం చేయిస్తా అని తనతో చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఎంపీ కాకముందు ఎవరూ ఇలా చెప్పలేదన్నారు.
అలాంటి వెంకట్రామిరెడ్డి ఉండేది కూడా పక్కనే కొల్లూరులోనే అని చెప్పారు. అన్నా అంటే నేనున్నా అని వస్తాడని పేర్కొన్నారు. ఆయన డబ్బుల కోసం, పదవుల కోసం రాలేదని, వెంకట్రామిరెడ్డి నిలబడతా అని అడగలేదని, తానే అడిగానని పేర్కొన్నారు. మీ అందరి దీవెనలతో వెంకట్రామిరెడ్డి తెలంగాణ మొత్తంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నడని తనకు రిపోర్టు అందిందని, కాబట్టి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ది మూడో స్థానమేనని, బీఆర్ఎస్కు బీజేపీ మధ్యనే పోటీ ఉందని, ముస్లింలు పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీ గెలిచే ప్రమాదముందని కేసీఆర్ హెచ్చరించారు.
మదన్రెడ్డి కాంగ్రెస్లోకి ఎందుకు పోయిండు? టీడీపీలో పోటీచేసి ఓడిపోయిండు. ఆయన్ను రెండుసార్లు ఎమ్మెల్యే చేసింది నేనే.70 ఏండ్ల వయసులో ముసలితనానికి కుసుమగుడాలు అన్నట్టు ఎవరిని ఉద్దరిద్దామని
కాంగ్రెస్లోకి వెళ్లిండు.
– కేసీఆర్
స్కేర్ఫీట్కు రూ.75 చొప్పున వసూలు
పటాన్చెరు నియోజకవర్గం ఏర్పడినప్పుడు 2 లక్షల ఓటర్లు ఉండగా, ఇవాళ 4 లక్షల ఓటర్లు ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన టీఎస్ఐపాస్ పాలసీ, 24గంటల కరెంటు వల్ల పరిశ్రమలు పెరిగాయని, పరిశ్రమల హబ్గా తయారైందని వివరించారు. ఫలితంగా దేశం నలుమూలల నుంచి, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి అనేక మంది తరలివచ్చి పొట్టపొసుకుంటున్నారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లా రియల్ఎస్టేట్ కుప్పకూలిందని వివరించారు.
పటాన్చెరు, కొల్లూరు, హైదరాబాద్లో ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పటినుంచి ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. స్కేర్ఫీట్కు రూ.75 ఇస్తేనే పర్మిషన్లు ఇస్తారన్న విమర్శలు ఉన్నాయని తెలిపారు. పటాన్చెరులో ఒకప్పుడు కలుషిత జలాల తాగి ప్రజలు రోగాలపాలయ్యారని, మిషన్భగీరథ ద్వారా తాము పరిశుభ్రమైన నీటిని అందించామని పేర్కొన్నారు. కొల్లూరులో దేశంలోనే తొలిసారి 16,500 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చామని తెలిపారు.
నరేంద్రమోదీ కృష్ణా, గోదావరి నీళ్లను తమిళనాడుకు తరలిస్తామని మాట్లాడుతున్నారని, అయినా సీఎం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. మన నీళ్లు మనకే దక్కాలన్నా, మన పరిశ్రమలు మనకే ఉండాలన్నా? కండ్లద్దాలు తయారు చేసే కంపెనీ, కోచ్ ఫ్యాక్టరీ నిలబడి ఉండాలన్నా? పటాన్చెరుకు పరిశ్రమలు ఇంకా తరలిరావాలన్నా బీఆర్ఎస్ గెలవాలని పేర్కొన్నారు. డజన్మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రాష్ర్టాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
‘మదన్రెడ్డి ఎందుకు పోయిండు?’
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డిపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్గాంధీ నిర్మల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తున్నదని చెప్పారని, మరి వచ్చిందా? అని ప్రశ్నించారు. వాటిని తెచ్చేందుకే మదన్రెడ్డి కాంగ్రెస్లో పోయాడని అంటున్నారని, మరెందుకు రాలేదని నిలదీశారు. మరి మదన్రెడ్డి కాంగ్రెస్లోకి ఎందుకు పోయిండని ధ్వజమెత్తారు.
తెలుగుదేశంలో ఉండగా టికెట్ ఇస్తే ఓడిపోయాడని, ఆయనను రెండుసార్లు ఎమ్మెల్యేను చేసింది తానేనని చెప్పారు. 70 ఏండ్ల వయసులో ముసలితనానికి కుసుమగుడాలు అన్నట్టు ఎవరిని ఉద్దరిద్దామని కాంగ్రెస్లోకి వెళ్లాడని ప్రశ్నించారు. ఇది ధర్మమేనా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మనల్ని విడిచిపెట్టిన మదన్రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పెద్ద మెజార్టీ ఇచ్చి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు.