మహిళలకు 2500 ప్రతినెలా ఇస్తున్నమని రాహుల్గాంధీ నిర్మల్లో చెప్తున్నడు. మీకెవరికైనా వచ్చినయా? కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ రూ.లక్ష ఇస్తే, మేం తులం బంగారం కూడా ఇస్తమని కాంగ్రెస్ చెప్పింది. ఇచ్చిందా ఎవరికైనా? పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు బంద్ అయ్యింది? విదేశాల్లో చదువుకోసం 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తే.. దాన్నీ బంద్ పెట్టిండ్రు. కేసీఆర్ కిట్ ఇస్తున్నరా? సీఎంఆర్ఎఫ్ వస్తున్నదా? వాళ్లు చెప్పిన గ్యారెంటీలను వాళ్లే అమలు చేయరు. ఇప్పటికే ఉన్న కేసీఆర్ పథకాలనూ నడుపుడు వీళ్లకు శాతకాదు.
– జగిత్యాలలో కేసీఆర్
KCR | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): నిర్మల్ సభలో రాహుల్గాంధీ మాట్లాడుతూ మహిళలకు రూ. 2500 ఇస్తున్నట్టు చెప్పారని, మరి జగిత్యాలలో ఎవరికైనా వచ్చాయా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. స్పందించిన ప్రజలు తమకు రాలేదని సమాధానమిచ్చారు. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ రూ.లక్ష ఇస్తే, తాము తులం బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. ‘మరి ఎవరికైనా తులం బంగారం వచ్చిందా?’ అని ప్రశ్నించగా.. ‘లేదు.. లేదు’ అని ప్రజల నుంచి సమాధానం వచ్చింది. విద్యార్థులు విదేశాల్లో చదువుకొనేందుకు తాము రూ.20 లక్షల స్కాలర్షిప్ ఇస్తే, ఈ ప్రభుత్వం దానిని కూడా బంద్పెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారని తెలిపారు.
కేసీఆర్ కిట్, సీఎంఆర్ఎఫ్ వస్తున్నయా? అని కేసీఆర్ ప్రశ్నించగా, రాలేదని జనం బదులిచ్చారు. బస్సుయాత్రలో భాగంగా ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే రాష్ర్టాన్ని ఆగమాగం చేసిందని, అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. గతంలో ఉన్న పథకాలను బంద్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.. ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగిత్యాల జిల్లాను తీసివేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్లో బీఆర్ఎస్ గెలిస్తే జిల్లా కోసం పోరాడవచ్చని పేర్కొన్నారు. మోదీ పదేండ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని విమర్శించారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా ఎలాంటి ప్రయోజనమూ జరగలేదని తెలిపారు.
‘ఇప్పుడున్న ప్రభుత్వానికేం తెల్వది. ఏ పనీ సరిగా చేయొస్తలేదు’ అని కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో వరద కాల్వను రిజర్వాయర్గా మార్చుకున్నామని, దానిపై మత్స్యకారులు, రైతులు బతికారని గుర్తుచేశారు. చెరువులు నింపడానికి వరద కాల్వకు ఎక్కడికక్కడ ఓటీలు పెట్టామని తెలిపారు. చొప్పదండి, బాల్కొండ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కావాల్సినన్ని తూములు ఏర్పాటు చేయించి, చెరువులు నింపినట్టు చెప్పారు. వాటికింద రైతులు వ్యవసాయం చేసి బాగా బతికారని గుర్తు చేశారు. ‘ఇప్పుడు వరద కాలువను ఎందుకు ఎండబెట్టారు? దీనికి బాధ్యులు ఎవరో ఆలోచించాలి’ అని ప్రజలను కోరారు. బీడీ కార్మికులు, చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్షిప్లు రావడం లేదని, దీనికి కారణం ఏమిటో ఆలోచించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన స్కీములను పట్టించుకోకపోయినా, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలైనా అమలవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అన్నవస్ర్తానికి పోతే ఉన్నవస్త్రం పోయినట్టు.. కొత్త పథకాలు వస్తాయనుకుంటే అవి గంగలో కలిశాయని, పాత వాటిని కూడా బంద్పెట్టే దుర్మార్గం జరుగుతున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో పట్టణ పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి అందరి ఇండ్లలో నల్లాలు పెట్టి గోదావరి నీళ్లు దుంకించినట్టు చెప్పారు. మిషన్ భగీరథ నీళ్లు, కరెంటు కోతలపై అడిగిన ప్రశ్నలకు ప్రజల నుంచి చక్కని స్పందన లభించింది. ఇన్నేండ్లు వచ్చిన కరెంటు ఎక్కడికి పోయిందని, తాగునీళ్లు ఎందుకు బందయ్యాయని, ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వానికి నేత కార్మికులు, బీడీ కార్మికులు, గీతకార్మికులు పట్టరని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏ ఒక్కరి సంక్షేమం చూడడం లేదని, ఐదు నెలల్లోనే రాష్ర్టాన్ని ఆగం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు.
మీ కండ్లముంగటనే మీ గోదావరి నీళ్లను నేను ఎత్తుకుపోతాను అని మోదీ అంటుంటే ఈ ముఖ్యమంత్రి సప్పుడు చేయడు. గోదావరిని పోనిద్దామా? ఎవరు కాపాడాలి గోదావరిని? బీజేపోడు, కాంగ్రెసోడు గెలిస్తే మాట్లాడతరా? మూతి, చేతులు ముడుసుకొని ఉంటరు తప్ప మాట్లాడరు.
-కేసీఆర్
ఉద్యమ సమయంలో తాను జగిత్యాలకు చాలాసార్లు వచ్చానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ఏర్పడడం దశాబ్దాల కల అని చెప్పారు. చివరికి తాము జిల్లా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటవుతుందని ఏనాడూ ఊహించలేదని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాల జిల్లాను తీసేస్తా అంటున్నదని మండిపడ్డారు. ‘జగిత్యాల జిల్లా ఉండాల్నా? పోవాల్నా?’ అని ప్రశ్నించగా.. ‘ఉండాలి’ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. జగిత్యాల జిల్లా ఉండాలంటే నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్, పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవాలని కేసీఆర్ కోరారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, ఆరేడేండ్లు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని కేసీఆర్ గుర్తు చేశారు. తాము రైతుబంధు కాకుండా రైతు భరోసా ఇస్తామని, రూ. 7,500 చొప్పున ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ మొదటి రూ. 5 వేలకే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధును ఐదెకరాలకే పరిమితం చేస్తామని అంటున్నారని, మరి ఆరేడు ఎకరాల రైతులు ఏం పాపం చేశారని సూటిగా ప్రశ్నించారు. రైతుబంధుపై నియంత్రణ పెట్టాలనుకుంటే 20-25 ఎకరాలకు పెట్టాలని సూచించారు. ఈ ప్రభుత్వం వడ్లు కూడా కొనడం లేదని, తాను వస్తుంటే రోడ్లకు ఇరువైపులా ధాన్యం కుప్పలు కనిపించాయని తెలిపారు. ప్రభుత్వం యాసంగి వడ్లు కొనడం లేదని, రూ. 500 బోనస్ ఇవ్వలేదని, బోనస్ బోగస్ అయిందని దుమ్మెత్తిపోశారు.
డిసెంబరు 9న 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడని, అయిందా? అని ప్రశ్నించారు. కాలేదంటూ రైతులు నినదించారు. తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఏ ఊరికి వెళ్తే అక్కడి దేవుడిపై ఒట్టు పెడుతున్నాడని, ఇలాంటి సీఎంను నమ్మొచ్చా? అని అడగ్గా, ‘లేదు.. లేదు’ అని బదులిచ్చారు. తెలంగాణ కోసం తాను ప్రాణం అడ్డం పెట్టి 15 ఏండ్లు రాజీలేని పోరాటం చేశానని, తాను నిమ్స్లో పడి ఉంటే ప్రజలు నిరాహార దీక్షలు చేసి పులుల్లాగా కొట్లాడితే రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. ఐటీలో, పారిశ్రామికరంగంలో రూ.లక్షల కోట్ల పరిశ్రమలు తెచ్చామని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్లాస్టిక్, అల్యూమినియం పరిశ్రమలు బేజార్ అవుతున్నాయని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ‘ఈ దుర్మార్గ ప్రభుత్వం వల్ల రాష్ట్రం పరువు గంగలో కలిసిపోతున్నది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ గుండె చీల్చితే తెలంగాణ ఉంటది. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు తెలంగాణ కోసం అంకితమై పోరాడుతడు. నాకు వేరే లక్ష్యం లేదు. తెలంగాణే నా లక్ష్యం.
– కేసీఆర్
రైతులు, గిరిజనులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా మోదీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. పదేండ్ల పాలనలో అచ్చే దిన్ వచ్చిందా? అని ప్రజలను అడగ్గా.. ‘లేదు.. లేదు’ అంటూ సమాధానం వచ్చింది. బీజేపీ పాలనలో అచ్చేదిన్ రాలేదుగానీ, అడ్డగోలుగా ధరలు పెరిగి సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ‘అమృత్ కాల్’ వచ్చిందా? ‘భేటీ పడావో.. భేటీ బచావో’ వచ్చిందా? ‘జన్ధన్’ ఖాతాలో డబ్బులు పడ్డ యా?’ అని ప్రశ్నించగా రాలేదంటూ ప్రజలు సమాధానమిచ్చారు. ‘జగిత్యాలలో రూ.15 లక్షలు పడ్డయట కదా?’ అని అడగ్గా.. ‘పడలేదు’ అని చెప్పారు. రూపాయి విలువ డాలర్తో పోల్చితే రూ.84కు పడిపోయిందని తెలిపారు. ఎగుమతులు బంద్ అయ్యాయని, దిగుమతులు పెరిగాయని, దేశంపై రూ.100 లక్షల కోట్లు అప్పులు పెరిగాయని ఆరోపించారు.
మల్యాల, మే 5: జగిత్యాల రోడ్షోకు వెళ్తన్న కేసీఆర్ కొండగట్టు దిగువన ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. అక్కడ సమోసా తిని చాయ్ తాగారు. విషయం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో గూమిగూడారు. మహిళలు, చిన్నారులు, నేతలు కేసీఆర్ను కలిసి సెల్ఫీలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ వెంట కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బీ వినోద్కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, పన్యాల భూపతిరెడ్డి, రాంమోహన్రావు, తిరుపతిరెడ్డి ఉన్నారు.
‘బీజీపీకి, కాంగ్రెస్కు పోటీ ఉంది. బీఆర్ఎస్కు ఎంపీలు ఎందుకు?’ అని కొందరు మాట్లాడుతున్నారని, ఇక్కడ గతంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారని, వాళ్లు కేంద్రం నుంచి నాలుగు రూపాయలైనా తీసుకురాలేదని కేసీఆర్ తెలిపారు. ‘ఏమైన్నా అభివృద్ధి చేసిండ్రా’ అని కేసీఆర్ ప్రశ్నించగా.. ‘లేదు’ అని ప్రజలు సమాధానం ఇచ్చారు. ‘నిజామాబాద్లో ఎంపీగా గెలిచిన అర్వింద్ పొద్దున్నే లేస్తే విషం చిమ్మడం తప్ప, నాలుగు రూపాయల పనైనా కాలేదు’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘పసుపు బోర్డు వచ్చిందా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచిండ్రా’ అని కేసీఆర్ ప్రశ్నించగా.. ‘లేదు, లేదు’ అని ప్రజలు నినదించారు.
‘ఈ కాంగ్రెస్ మెడలు వంచి ఆరు గ్యారెంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. మన నదులు కాపాడాలంటే బీఆర్ఎస్ గెలవాలి. ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే. నరేంద్రమోదీ మనకు ఉన్న గోదావరి నుంచి నీళ్లను తమిళనాడు, కర్ణాటకకు తీసుకుపోతా అంటున్నాడు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీ ముందర మాట్లాడతరా? అదే ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంట్ దద్దరిల్లేలా కొట్లాడతరు. మన గోదావరి మనకు ఉండాలన్నా, మన కృష్ణా నీళ్లు మనకు దక్కాలన్నా, మన హక్కులు మనకు ఉండాలన్నా, మన నిధులు మనకు రావాలన్నా, న్యాయం జరగాలన్నా కచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి. వారే గెలువాలి. బీఆర్ఎస్ బిడ్డలైతేనే పేగులు తెగేదాకా కొట్లాడతరు.
‘జగిత్యాల ముస్లిం బిడ్డలకు నమస్కరించి చెబుతున్నా మీరు ఓటు వేసేముందు ఆలోచించండి. బీఆర్ఎస్ ఎప్పుడూ సెక్యులర్ పార్టీ. బీఆర్ఎస్ హయాంలో ముస్లిం సోదరులకు ఎన్నో మంచి పనులు చేశాం. నాడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ముస్లిం బిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చాం. కాంగ్రెస్కు, బీజేపీకి ఓటు వేసినా ఎలాంటి ఉపయోగం లేదు. బీఆర్ఎస్ను గెలిపిస్తే దేశంలో సెక్యులర్ వ్యవస్థ కోసం పోరాడతాం. ముస్లిం బిడ్డలకు బ్రహ్మాండమైన గురుకులాలు పెట్టించాం. మన పాలనలో ముస్లిం సోదరులు ఫుల్ ఖుషీగా ఉన్నారు’ అని కేసీఆర్ జగిత్యాలలోని ముస్లిం సోదరులను ఉద్దేశించి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రి ఉన్నా ఐదు రూపాయల అభివృద్ధి కూడా జరగలే. మోదీ ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ సబ్ కా సత్యనాశ్ అయింది.మోదీది గ్యాస్ పురాణమే తప్ప దేశంలో ఒక్కరికి కూడా మేలు జరగలే.
– కేసీఆర్
జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో ఉన్న బీడీ కార్మికులను ఆదుకున్నది బీఆర్ఎస్ ఒక్కటేనని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ బీడీ కార్మికులను ఏనాడు ఆదుకోలేదని, ఎప్పుడూ రూపాయి పింఛను ఇవ్వలేదని కేసీఆర్ విమర్శించారు. బీడీ కార్మికులను ఆదుకున్నది, వారి బతుకులను నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని కేసీఆర్ చెప్పారు. నేడు మోదీ ప్రభుత్వం బీడీ కార్ఖానాలను మూసివేస్తామంటే రేవంత్రెడ్డి ఆయనకు డబ్బా కొడుతున్నాడని, బీడీ కార్మికుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘జగిత్యాలలో ఉన్న రమణయ్యసార్ వంటి కవులు, రచయితలు, మేధావులు, విద్యావంతులందరికీ మీ తెలంగాణ బిడ్డగా దండం పెట్టి చెప్తున్నా. నేను తెలంగాణను ఎంత బ్రహ్మాండంగా చేసిననో మీకు తెలుసు. నాడు ఇద్దరు ఎంపీలతోనే ఢిల్లీకి పోయి తెలంగాణ తెచ్చిన. నా కండ్లముందే తెలంగాణ ఆగమవుతుంటే నేను పిడికిలి బిగించి మీ ముందుకొచ్చా. చేజేతులా మీరు కృష్ణా, గోదావరి నీళ్లు, మన హక్కులను పోగొట్టుకోవద్దు. మన నిధులును మనం తెచ్చుకోవాలె. అందరం కలిసి ముందుకుపోవాలె’ అని కోరారు. ‘బీఆర్ఎస్ గెలుపులోనే తెలంగాణ విజయం ఉన్నది. కాబట్టే తెలంగాణ మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఉద్యమకారులు అందరూ విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్కు ఓటు వేసి గెలింపించాలి.
తెలంగాణలోని గిరిజన బిడ్డలకు బీఆర్ఎస్ హయాంలో 10శాతం రిజర్వేషన్ ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. ‘గిరిజనులకు రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెడితే, దాని తరఫున ప్రభుత్వం గట్టిగా వాదించాలి కదా? రిజర్వేషన్ కావాలని నిలదీయాలి కదా. కేసు గెలిచి, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కదా? శాస్త్రీయంగా లెక్కచేసి చెప్పినా కూడా వాళ్లకు పెట్టే పరిస్థితి లేదు’ అని రాష్ట్రప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. నాడు తెలంగాణలో వరద కాల్వలను రిజర్వాయర్లు చేసుకున్నామని తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా 3 కోట్ల టన్నుల వడ్లను పండించామని, నాడు వడ్లను కొనేందుకు మోదీ నిరాకరిస్తే ఢిల్లీలో ధర్నా చేసినట్టు గుర్తుచేశారు. యాసంగి వడ్లు కొద్దిగా నూకలు అవుతాయని చెప్తే.. తెలంగాణ వాళ్లనే ఆ నూకలు తినమన్న నూకరాజు మన ప్రధాని మోదీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తికి ఓటెందుకు వేయాలని నిలదీశారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీదే కాబ్టటి ఎవరు గెలిస్తే మంచిదో ఆలోచించి ఓటు వేయాలని యువతకు విజ్ఞప్తి చేశారు.