కృష్ణా జలాల్లో న్యాయమైన హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు మరోసారి సమరశంఖం పూరిస్తున్నారు. కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు స్వయంగా హాజరై ఆయన తన సందేశం వినిపించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న ఈ బహిరంగసభకు దాదాపు రెండు లక్షల మంది ప్రజలు తరలివస్తారన్న అంచనాలున్నాయి.
Chalo Nalgonda | హైదరాబాద్/నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ):నల్లగొండ పట్టణ శివారులో నార్కట్పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్లో విశాలమైన స్థలంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలిరానున్నారు.
ఈ నేపథ్యంలో 300 మంది కూర్చునేలా విశాలమైన వేదికను నిర్మించారు. దాని పక్కనే కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా మరో వేదికను సిద్ధంచేశారు. వేదికకు ఎదురుగా వీఐపీ, మీడియా గ్యాలరీలను నిర్మించారు. వాటి వెనుక ప్రజలు కూర్చునేలా ప్రత్యేకంగా పలు గ్యాలరీలను ఏర్పాటుచేశారు. కేసీఆర్ హెలికాప్టర్లో వస్తే ఇబ్బంది లేకుండా సభా ప్రాంగణం పక్కనే హెలిప్యాడ్ను సిద్ధ్దం చేశారు.
నల్లగొండతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలిరానుండటంతో సభా ప్రాంగణానికి నలువైపులా జనం చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ కోసం అన్ని వైపులా ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశారు. మరోవైపు సభకు పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు చేపడుతున్నది. సభా ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కలిసి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, జీవన్రెడ్డి, చంటి కాంత్రికిరణ్, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, కంచర్ల కృష్ణారెడ్డి, చాడ కిషన్రెడ్డి, గుత్తా అమిత్రెడ్డి, రవీందర్సింగ్తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కేసీఆర్ సభపైనే అందరి దృష్టి : జగదీశ్రెడ్డి
ఇప్పటికే కృష్ణానది ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందని, ఇదే అంశంపై నల్లగొండలో నిర్వహిస్తున్న కేసీఆర్ సభ మీద అందరి దృష్టి కేంద్రీకృతమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి చెప్పారు. సభకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. సభకు తరలివచ్చే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్టు వివరించారు.
మరోసారి ఉద్యమబాట
కృష్ణానదీ జలాల్లో న్యాయమైన వాటా కోసం గొంతెత్తి నినదించిన ఏకైక తెలంగాణ నాయకుడు కేసీఆరే. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలో జలసాధన యాత్రలు నిర్వహించి ప్రజలను జాగృతం చేసిన చరిత్ర మన కండ్లెదుటే ఉన్నది. నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు కృష్ణా జలాల్లో తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని తీవ్రంగా ఎండగట్టారు.
తెలంగాణ యావత్ సమాజాన్ని చైతన్యపరచి ఆ దిశగా కదిలించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అక్రమంగా, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేలా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ విస్తరణకు పూనుకుంటే, ఆ నిర్ణయం తెలిసిన మరుక్షణమే పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టి ఉద్యమబాట పట్టారు. ఇటు స్వరాష్ట్రంలోనూ తెలంగాణ జలహక్కుల సాధన కోసం పదేండ్లపాటు అవిశ్రాంత పోరాటం చేశారు.
ఆపరేషన్ ప్రొటోకాల్, నీటి పంపకాలు పూర్తికాకుండా కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం వాటిల్లుతుందని కేసీఆర్ ఆదినుంచీ బలమైన వాదనలు వినిపిస్తున్నారు. గత పదేండ్లుగా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించకుండా తెలంగాణ జలహక్కులను కాపాడుకుంటూ వచ్చారు. కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3ను సాధించారు.
తద్వారా తెలంగాణ రాష్ట్రం తనకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటాను పొందేందుకు బాటలు వేశారు. స్వరాష్ట్రంలో సాధించిన జలహక్కులను ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కాలరాసేందుకు పూనుకోవడంతో మళ్లీ పోరుకేక పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరితో, కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగించడం వల్ల కలిగే నష్టాన్ని తెలంగాణ సమాజానికి వివరించి చైతన్యపరిచేందుకు సంసిద్ధమయ్యారు. ఇప్పటికే కృష్ణా బేసిన్ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులను, కార్యకర్తలను కదిలించారు.