CM KCR | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 26, 27 తేదీల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రానికి సోలాపూర్ చేరుకుంటారు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు భారీ కాన్వాయ్గా తరలి వెళ్లనున్నారు. ఆ రాత్రి అక్కడే బసచేస్తారు. ఈ సందర్భంగా సోలాపూర్లోని పలువురు మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికుల కుటుంబాలు సీఎం కేసీఆర్ను కలిసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మంగళవారం (ఈనెల 27న) ఉదయం సోలాపూర్ జిల్లాలో పండరిపూర్కు చేరుకొని అక్కడి విఠోభారుక్మిణి మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సోలాపూర్ జిల్లా ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగి ప్రయాణం కానున్నారు. హైదరాబాద్ వస్తు న్న క్రమంలో దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్కు అదే రోడ్డుమార్గాన చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.