Gas Cylinder | బతుకమ్మకు మలీద-సత్తుపిండి చేసుకుందామన్నా, దసరాకు అప్పాలు చేద్దామనుకున్నా.. పేదింటికి సిలిం‘డర్’ తప్పట్లేదు. పండుగ ఆనందాన్నీ ఆవిరి చేస్తున్న గ్యాస్ సిలిండర్ ధరను చూస్తే అందరిదీ ఒకే నిట్టూర్పు! ఈ గ్యాస్ ట్రబుల్ ఇకపై తప్పనున్నది. మూడోవంతు రేటుకు సిలిండర్ ఇంటి ముంగిటకు రాబోతున్నది. మళ్లీ అధికారంలోకి రాగానే వంటగ్యాస్ సిలిండర్ను రూ.400కే అందిస్తామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అదే జరిగితే కుటుంబానికి ఏటా రూ.4 వేలు ఆదా అయినట్టే.
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): పేదలపై మోదీ సర్కారు మోపిన బండ భారాన్ని తగ్గించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాక రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన హామీని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. కేసీఆర్ నిర్ణయంతో ఒక్కో కుటుంబంపై ఏటా సుమారు రూ.4 వేలు ఆదా కానున్నాయి. మళ్లీ సంతోషంగా సిలిండర్పై ధైర్యంగా వంట చేసుకునే పరిస్థితి రానున్నది.
2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాగానే ప్రధాని మోదీ పేదలపై కక్షగట్టారు. ఇందులో భాగంగానే పేదలపై బండ భారాన్ని మోపారు. అడ్డూఅదుపు లేకుండా ఎడాపెడా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశారు. ప్రధాని మోదీ అధికారంలో వచ్చిన 2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ.414 మాత్రమే. అది 2023లో రూ.1,155 కి చేరింది. రెండు నెలల క్రితం వరకు ఇదే ధర కొనసాగింది. అంటే మోదీ వచ్చిన ఏకంగా రూ.741 ధర పెంచటం గమనార్హం. దీంతో కుటుంబాలపై ఆర్థిక భారం పడింది. ఒక్కో కుటుంబంపై ఏటా సగటున రూ.5 వేల వరకు భారం పడింది. దీంతో గ్యాస్ బుక్ చేయాలంటేనే పేదలు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్యాస్ సిలిండర్ను మూలన పెట్టేసి, మళ్లీ కట్టెల పొయ్యి వైపు మళ్లారు. కట్టెల పొగ, ఇతర సమస్యలతో అనారోగ్యం బారిన పడుతున్నారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన హామీ పేదలకు వరంగా మారనున్నది. ఈ హామీపై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. బండ భారం తగ్గుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఒక్కో సిలిండర్ను రూ.955కు విక్రయిస్తున్నది. అయితే సీఎం కేసీఆర్ దీన్ని రూ.400కే ఇవ్వనున్నారు. అంటే ఒక్కో సిలిండర్పై రూ.555 ఆదా కానున్నది. ఒక కుటుంబం సగటున ఏటా 7-8 సిలిండర్లను వినియోగిస్తుందని అంచనా వేసుకున్నా, ఏటా రూ.4వేల వరకు మిగలనున్నది.
మాది పెద్ద కుటుంబం. ఇద్దరు కొడుకులు, కోడండ్లు. ఒక మనుమరాలు. మా ఆయన, నేను. వంట చేసుకోవాలంటే నెలకో గ్యాస్ సిలిండర్ పడ్తది. అంటే నెలకు రూ.1,200. ఏడాదికి 12 సిలిండర్లు అంటే రూ.14,400 గ్యాస్కే ఖర్చు అయితుండె. అందుకని కట్టెలపొయ్యి మీదనే వండుకుంటున్నం. మళ్లా అధికారంలోకి వస్తే రూ.400కు వంటగ్యాస్ ఇస్తమని సీఎం కేసీఆర్ చెప్పిండు. సంతోషం అనిపించింది. మళ్లా సారే వస్తడు. మాలాంటోళ్లకు రూ.400కే సిలిండర్ దొరుకుతది. ఇపుడు ఒక సిలిండర్కు పెడుతున్న రూ.1,200తో 3 సిలిండర్లు వస్తయ్. 3 నెలలు సరిపోతయ్.
– పస్తం పద్మ, బాలాజీనగర్, వరంగల్
కట్టెల పొయ్యితో ఇబ్బందైతందని గ్యాస్ కనెక్షన్ తీసుకున్నం. అప్పుడు రూ.400కే గ్యాస్మొద్దు ఇచ్చేటోళ్లు. మోదీ సర్కారు వచ్చినప్పటి నుంచి గ్యాస్ ధరలు పెంచుకుంట పోయిన్రు. రూ.1,200 చేసిన్రు. అసలే కూలీ పనులు చేసుకునేటోళ్లం. గన్ని డబ్బులు పెట్టి ఎట్లా కొనుక్కుంటం. గందుకే మళ్లా కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకుంటున్నం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లా గెలిస్తే రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తనని చెప్పిండు. ఆయన మాటిస్తే కచ్చితంగా చేసి తీరుతడు. మళ్లా బీఆర్ఎస్నే గెలిపించుకుంటం.
– దుర్గం పుష్పలత, కుకుడ, బెజ్జూర్ మండలం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా
మాది మధ్య తరగతి కుటుంబం. నా భర్త కూలీ పనికి వెళ్తేనే ఇల్లు గడిచేది. రోజువారి కూలీ చేసిన డబ్బులతోనే కుటుంబాన్ని నడుపుతున్నం. పెరిగిన ధరలతో గ్యాస్ సిలిండర్ కొనలేకపోతున్నం. కట్టెల పొయ్యి మీద వంట చేద్దామంటే ఫారెస్ట్ వాళ్లు అడవిలోకి రానివ్వటం లేదు. కిరోసిన్ దొరకటం లేదు. సిలిండర్ కొందామంటే ఎక్కడలేని బాధనిపిస్తున్నది. ఈ సమయంలో కేసీఆర్ సార్ దేవుడిలా వంట గ్యాస్ను రూ.400కే ఇస్తమని అంటుండు. నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాల బాధలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి మళ్లీ రావాలి. గెలిస్తే మా ఇబ్బందులను తీరుస్తడు.
– ఎస్కే యాసిన్, నిర్వాసిత కాలనీ, ఇల్లందు టౌన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
రూ.400కే సిలిండర్ ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఎంతో గొప్పది. ఇది పేద వినియోగదారులకు గొప్ప వరం. ఇటీవల గ్యాస్ ధరలు పెరగటంతో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది నెలల పాటు గ్యాస్బుక్ చేసుకోలేదు. ఇప్పుడు గ్యాస్ ధర అందుబాటులోకి వస్తే వాళ్లంతా మళ్లీ గ్యాస్ వినియోగిస్తారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పేదలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.
– జగన్మోహన్రెడ్డి, గ్యాస్ డీలర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
గ్యాస్ ధర తగ్గిస్తమని హామీ ఇచ్చి కేసీఆర్ సారు మాలాంటి పేదోళ్లకు మంచిజేస్తుండు. రూ.400కే సబ్సిడీ సిలిండర్ను నిరుపేద మహిళలకు ఎంతో మేలుజేసే పథకం. కుటుంబానికి పెద్ద భారం తీరుతుంది. కేసీఆర్ చెప్పినట్టే చేస్తడు. ఆయన మీద నమ్మకం ఉన్నది. ఆయన నూరేండ్లు సల్లగ బతకాలని దేవున్ని మొక్కుతం. ఆయన మంచిగుంటే మాలా ంటి పేదోళ్లు సంతోషంగా బతుకుతరు.
-రజిత, అల్వాల్
మేము కూలి చేసుకుంటేనే బతుకుదెరువు. కుటుంబ పోషణ కోసం మా ఆయన దుబాయ్ వెళ్లిండు. బీడీలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నా. ఒక సిలిండర్ కొనడానికి 1,200 అవుతుంది. గ్యాస్ సిలిండర్ కొనలేని పరిస్థితి నాది. నేను బీడీలు చేస్తే వచ్చేది రూ.2,000. అందులో సిలిండర్కే 1,200 పోతే బతుకుడు ఎట్ల. ఇప్పుడు కేసీఆర్ సాబ్ రూ.400కే సిలిండర్ ఇస్తామని చెప్పడం ఖుషీ అన్పిస్తుంది.
-కరీమున్నిసా, సిద్దిపేట