నర్సాపూర్, నవంబర్ 10: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని, ఏ ఒక్కరికి ఓటేసినా నిలువునా మోసపోతామని మంత్రి టీ హరీశ్రావు హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో ఉన్న వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి అని చెప్పారు. కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం, నయవంచన అని వ్యాఖ్యానించారు.
వాళ్లు మాట మీద నిలబడే రకం కాదు…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 2018 ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మాట తప్పాడని, ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోతే గడ్డం గీసుకోనని ఆనాడు సవాల్ చేసి మాట తప్పాడని హరీశ్రావు గుర్తుచేశారు. వాళ్లు ఎన్నడూ మాటమీద నిలబడే రకం కాదని విమర్శించారు. మన సీఎం కేసీఆర్ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పనిచేసే నిరంతర శ్రామికుడని, అలాంటి నాయకుడికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పట్టపగలు రూ. 50లక్షల లంచం ఇస్తూ దొరికిన దొంగ రేవంత్రెడ్డి అని, వీరి చేతిలో తెలంగాణ పెడితే బాగుపడదని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని, 11సార్లు అధికారంలో ఉండి నీళ్లు, కరెంట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ 11సార్లు రూ. 72వేల కోట్ల రైతుబంధును రైతుల ఖాతాల్లో వేశారని చెప్పారు.
రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్
ఈ ఎన్నికల్లో ఎక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందోనని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతుబంధు ఆపించారని మంత్రి హరీశ్ ఆరోపించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని రుజుమైందని పేర్కొన్నారు. రైతుబంధు పెట్టుబడి సాయంగా అందిస్తే అది దుబారా అని ఉత్తమ్కుమార్ పేర్కొనడం సిగ్గుచేటని అన్నారు. రైతుబంధును ముఖ్యమంత్రి కేసీఆర్ బిచ్చం వేస్తున్నాడంటూ రేవంత్రెడ్డి రైతులను అవమానించాడని గుర్తుచేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్లకే గ్యారెంటీ లేదు. ఆరు గ్యారెంటీలకు గ్యారంటీ ఏమున్నది. కాంగ్రెస్ వాళ్లకు టికెట్ కావాలంటే ఢిల్లీ.. పదవి కావాలంటే ఢిల్లీ.. ప్రచారానికి రావాలంటే ఢిల్లీ వాడే రావాలి. ఇక్కడి వాళ్లకు అంత సినిమా లేదు’ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ వస్తే కాలువల మీద మోటర్లు పెడితే జీపులేసుక పోతరు. దొంగ రాత్రి కరెంట్ వస్తది. నీళ్లు రావు.. మళ్లా అనవసరంగా కాంగ్రెస్తోని ఆగమైతం’ అని హెచ్చరించారు. రైతులందరూ కలిసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను బొందబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రన్ ఔట్, కేసీఆర్ సెంచరీ కొట్టడం ఖాయం అని చెప్పారు. సునీతాలక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే నర్సాపూర్ ఇంకా అభివృద్ధి చెందుతుందని, కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకటరాంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలే
తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే, కర్ణాటకలో ఐదు గంటలు మాత్రమే ఇస్తున్నామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. రేపు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తారని ముందస్తుగా హెచ్చరించారని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో పొద్దంతా రెండు గంటలు, దొంగరాత్రి మూడు గంటల కరెంట్ ఇచ్చారని గుర్తుచేశారు. మళ్లీ మనకు ఆ కాలం రావద్దంటే సీఎం కేసీఆర్ సర్కార్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు పొలాల వద్ద రైతులు కటక వేస్తే కరెంటొస్తున్నదని.. కాంగ్రెస్ గెలిస్తే కర్ణాటకలా కటిక చీకట్లు వస్తాయని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్ అన్న మాటలకు మెడమీద తలకాయ ఉన్నోడు ఎవరూ కాంగ్రెస్కు ఓటెయ్యరని, వేస్తే మన కన్నును మనమే పొడుచుకున్నట్టు అవుతుందని, దానిని ప్రతి ఒక్కరూ గ్రహించాలని అన్నారు.