Kotha Prabhakar Reddy | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో హింసాత్మక విధానాలకు తెరలేపింది. ఇది ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కాదు.. ప్రతిపక్ష నేతలు కొన్నేండ్లుగా తమ విద్వేష ప్రసంగాలతో క్రమంగా కార్యకర్తల్లో నాటిన విష బీజాల ఫలితమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమం త్రి కే చంద్రశేఖర్రావు సుదీర్ఘకాలం శాంతియుతంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు. గాంధేయమార్గంలో అహింసాయుతంగా ప్రజలను ఐక్యం చేసి, జాతీయ స్థాయిలో పోరాటం చేసి, రాజకీయంగా అన్ని పక్షాలను ఒప్పించి దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత పదేండ్లుగా రాష్ట్రం లో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్కడా అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా జాగ్రత్తపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బండి సంజయ్, రేవంత్రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ వంటి కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతల ప్రసంగాలతో ఆందోళనకర పరిణామాలు మొదలయ్యాయని నిపుణులు చెప్తున్నారు.
అధికార దాహంతోనే..
కేవలం అధికారం దక్కించుకోవాలనే యావతో విద్వేష పూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టేలా ఉన్మాద ప్రసంగాలు చేస్తూ కార్యకర్తల మనసులను కలుషితం చేయడం ప్రారంభించారని పలువురు అంటున్నారు. బండి సంజయ్ అనేకసార్లు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఏకంగా ‘మసీదులు తవ్వు దాం.. శివం బయటికి వస్తే మాకు, శవం బయటికి వస్తే మీకు’ అంటూ విపరీత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తలపై.. ముఖ్యంగా యువతపై ప్రతికూల ప్రభావం చూపించాయని అంటున్నారు. గంగా- జమున తెహ్జీబ్ సంస్కృతి పరిఢవిల్లే తెలంగాణ గడ్డమీద సామాజికంగా చీలికలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక రేవంత్రెడ్డి తన అధికార దాహంతో ముఖ్యమంత్రి కేసీఆర్పై, ఆయన కుటుంబంపై, ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఏకంగా ప్రగతిభవన్ మీద బాంబులు వేస్తామని ఫిబ్రవరిలో బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈటల రాజేందర్ సైతం సభ్యసమాజం తలదించుకునేలా దూషిస్తున్నారని, ‘ఎవడు రా కొడకా’ అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, పదేపదే తన కులం పేరు వాడుతూ సామాజికంగా విభజన సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఉదహరిస్తున్నారు. బీజేపీకి చెందిన మరో నేత ధర్మపురి అర్వింద్.. ‘కేసీఆర్ చనిపోతే బీజేపీ రూ. 5 లక్షలు ఇస్తుంది. కేటీఆర్ చనిపోతే రూ.10 లక్షలకు పెంచుతం. అదే కవిత చనిపోతే నేనే రూ.20 లక్షలు ఇస్తా’ అంటూ బాహాటంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో నాయకులపై దాడుల సంస్కృతి వెలుగుచూస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ దాడికి ఒక వ్యక్తిని బాధ్యుడిని చేస్తేనే సరిపోదు
దుబ్బాక నియోజకవర్గం సూరంపల్లిలో సోమవారం జరిగిన దాడికి ఒక వ్యక్తిని బాధ్యుడిని చేస్తేనే సరిపోదని, రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజల్లో విభేదాలు సృష్టిస్తున్న నాయకులందరి పాపం ఇందులో ఉన్నదని పలువురు మండిపడుతున్నారు. అధికారంలోకి రావడానికే ఇన్ని అరాచకాలకు పాల్పడితే.. ఒకవేళ వాళ్లు అధికారంలోకి వస్తే జరిగే పరిణామాలు ఊహించడం కూడా కష్టంగా ఉన్నదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.