ఖమ్మం, నవంబర్ 25: తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని రవాణా శాఖ మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిపువ్వా డ అజయ్కుమార్ విమర్శించారు. వారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లలో పేదలకు ఇచ్చింది తక్కువని, ఆ పార్టీ నేతలు బుక్కింది ఎక్కువని దుయ్యబట్టారు. శనివారం ఆయన ఖమ్మం నగరంలో పర్యటించారు. ఖమ్మం భూమి పుత్రుడినైన తనను గెలిపిస్తే ఇక్కడి ప్రజల మధ్యే ఉంటానని, వారి కష్టసుఖాల్లో తోడునీడగా నిలుస్తానని హామీ ఇచ్చారు. బయటి వ్యక్తులను ఆదరిస్తే వారు గెలిచినా, ఓడినా మళ్లీ ఇక్కడ కన్పించరని తెలిపారు. తాను మంత్రిగా ఉన్న ఈ ఐదేండ్లలో ఖమ్మంలో 2,500 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు అందించినట్టు చెప్పారు. తనను మరోసారి గెలిపిస్తే 10 వేల మంది పేదలకు ప్రభుత్వ స్థలాలు పంపిణీ చేసి గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉండి తనను అధిక మెజార్టీతో గెలిపిస్తే హైదరాబాద్ తర్వాత అంతలా అభివృద్ధి చెందిన నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.