హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ను రాబోయే వర్షాకాలం వరకు మరమ్మతులు చేయకుండా వచ్చే వరదలకు కొట్టుకుపోయేలా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. బరాజ్ కొట్టుకుపోతే కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేయాలని పథకం వేసిందని విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డి మాటల్లో ఇదే ఉద్దేశం కనపడుతున్నదని అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆకలికేకల తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం గిన్నెగా మార్చిందని తెలిపారు.
నేడు తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని చెప్పారు. ధాన్యం ఉత్పత్తి 24 లక్షల టన్నుల నుంచి మూడున్న కోట్ల టన్నులకు పెరిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గతంలో ఎకరం భూమి రూ.3 లక్షలు ఉంటే, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇప్పుడు అది 30 లక్షలకు చేరిన మాట నిజం కాదా? అని నిలదీశారు.
మార్చి ఒకటిన మేడిగడ్డ సందర్శన
మార్చి ఒకటోతేదీన మేడిగడ్డ బరాజ్ను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం సందర్శిస్తుందని కేటీఆర్ ప్రకటించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి సందర్శనకు వెళ్తామని తెలిపారు. ‘150 మందితో మేడిగడ్డకు వెళ్తాం. మీడియా బృందాన్ని కూడా తీసుకెళ్తాం. దశలవారీగా అన్ని బరాజ్లు, పంపుహౌస్లు సందర్శిస్తాం. మాతో కాంగ్రెస్ మంత్రులు వస్తామంటే వెంట తీసుకెళ్తాం.ప్రజలకు కాళేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను వివరిస్తాం.
మేడిగడ్డపై కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఎండగడుతాం. మేడిగడ్డలో రెండుమూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే బరాజ్ మొత్తం కూలిపోయిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ బరాజ్ ఒక్కటే కాదు. కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు, గుండ్లవాగు, మూసీ ప్రాజెక్ట్, సింగూరు, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయి. వాటిని తిరిగి మరమ్మతులు చేసి ప్రజలకు ఉపయోగపడేలా మార్చారు.
ఒక కాఫర్ డ్యాంని నిర్మించి మూడు పిల్లర్లకు వెంటనే మరమత్తులు నిర్వహించవచ్చు. రాజకీయంగా మాపై కోపం ఉంటే తీర్చుకోండి. రైతులను, ప్రజలను మాత్రం ఇబ్బందిపెట్టొద్దు. మేడిగడ్డపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పాం. దేశంలో అనేక ప్రాజెక్టులకు మరమ్మతులు చేపట్టారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద ఇప్పటికీ 5 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తున్నదని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను కన్నీళ్లు పెట్టించిన కాంగ్రెస్
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కన్నీళ్లు మిగిల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేటీఆర్ విమర్శించారు. నదీజలాల కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాల పాటు పోరాడారని, బాసర నుంచి భద్రాచలం దాకా పారుతున్న గోదారి జలాల కోసం ఉద్యమాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఎన్ని ఉద్యమాలు చేసినా గోదావరి నీళ్లను తెలంగాణకు అందించకుండా 60 ఏండ్లపాటు కాంగ్రెస్ పార్టీ కన్నీళ్లు మిగిల్చిందని గద్దర్, సదాశివుడు లాంటి కళాకారులు ప్రజలకు వివరించి చెప్పారని అన్నారు.
కేసీఆర్ జలసాధన పోరాటంతో ప్రతి మండలంలో బ్రిగేడియర్లను నియమించి రైతులను జాగృతం చేశారని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై బాబ్లీ ప్రాజెక్టు కట్టినా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూసిందని విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఎస్సారెస్పీ ఎండిపోయేలా చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంకాగానే ప్రాణహిత చేవెళ్ల అంటూ రంగుల కల చూపించారని, కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం పేరుతో నాటకాలకు తెరలేపిందని దుయ్యబట్టారు.
ఒక కాల్వ కూడా తవ్వకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో అడ్డగోలుగా నిధులు దోచిపెట్టారని విమర్శించారు. ఆనాటి జలయజ్ఞంలో రూ.52 వేల కోట్ల అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఎండగట్టిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ గొప్పగా చెప్పుకొంటున్న కాగ్ రిపోర్టులను కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్సింగ్ నుంచి మొదలుకొని ఆనాటి కాంగ్రెస్ సీఎం కిరణ్కుమార్రెడ్డి దాకా అందరూ తప్పుపట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. మరి కాగ్ రిపోర్టు నాడు తప్పు అయితే నేడు ఎలా ఒప్పు అవుతుందో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
మీరెందుకు అప్పులు చేస్తున్నారు?
రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా మాట్లాడుతున్నదని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభు త్వం చేసిన అప్పు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కొత్తగా అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు విధించిన వందరోజులు గడువు ముగుస్తున్నదని, ఆ హామీలను నిలుపుకునే పరిస్థితి లేక బుకాయించడానికి ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు.
కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదు
గోదావరి నీళ్లను తెలంగాణ పొలాలకు మళ్లించాలన్న సంకల్పంతో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చి కేసీఆర్ మహా ప్రాజెక్టుగా నిర్మించారని కేటీఆర్ తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద సరిపడా నీటి లభ్యత లేదని సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చిన తర్వాతనే నిపుణుల సలహాలతో మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. కాలంతో పోటీపడి కాళేశ్వరం కట్టిన ఘనత కేసీఆర్ది అని ఆయన అన్నారు.
‘కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం అంటే 3 బరాజ్లు, 15 రిజర్వాయర్లు, 21 పంప్హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల కాల్వలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 240 టీఎంసీల వినియోగం.. వీటన్నింటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. లక్ష కోట్లు కోట్టుకుపోయాయని ఒకవైపు చెప్తూ, రూ.3,500 కోట్ల బారాజ్ను.. అందులో కూడా 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లు దెబ్బతింటే మొత్తం బరాజ్ కొట్టుకపోయిందనే విధంగా చిత్రీకరిస్తున్నారు. 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కామధేనువు కాళేశ్వరం. 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్లు ఎత్తుకు గోదావరి గంగ ఎగిసిదుంకే జలదృశ్యాన్ని ఆవిషరించాం. తెలంగాణను కరువు నుంచి గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం’ అని పేర్కొన్నారు.
ప్రతి జల విజయం కాళేశ్వరంతోనే..
తెలంగాణ ఉద్యమానికి జడిసి నాడు ఆదరాబాదరాగా ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును 16.4 టీఎంసీలతో రిజర్వాయర్లు లేకుండా డి జైన్ చేశారని, కానీ కాళేశ్వరంలో 141 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మించామని కేటీఆర్ తెలిపారు. ‘కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు కలిపి 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా నిర్మించాం. 139 మెగావాట్ల సామర్థ్యంగల మోటర్లను పెట్టి నీటిని ఎత్తిపోసేలా చేశాం. కాళేశ్వరంలో నీటిని మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాల్సిన అవసరంలేదు.
ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, వరదకాల్వ, మిడ్మానేరు నుంచి కూడా ఎత్తిపోయొచ్చు. హైదరాబాద్ నగరం మంచినీటికి ఇబ్బంది పడొద్దని కాళేశ్వరం ని ర్మించాం. కాకతీయ కాల్వ 6 నెలలపాటు ఆరకుండా చివరి మడిని కూడా తడిపింది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే. ఈ విషయం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి కూడా తెలుసు.
కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ వరకు నీళ్లు వచ్చాయంటే కాళేశ్వరం వల్లనే. కాళేశ్వరం ద్వారా చెరువులు నింపుకున్నాం. జల విజయాలన్నీ కాళేశ్వరం పుణ్య మే. సిరిసిల్ల జిల్లాలో ఆరు మీటర్ల మేర భూగ ర్భ జలాలు పైకి వచ్చాయి. కాళేశ్వరం వల్ల పాతాళగంగ పైకి వచ్చింది’ అని వివరించారు. ముషంపల్లిలో బోర్ల రాంరెడ్డి 54 బోర్లకు పెట్టిన ఖర్చును ఎవరి ఖాతాలో వేస్తారని నిలదీశారు. కాస్ట్ బెనిఫిట్ను లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వ దవాఖానలు, ఐఐటీ, ఐఐఎం, ఆర్ఈసీలు కట్టకూడదని అన్నారు.
తెలంగాణలో రైతులకు నీళ్లు ఉంటే వరిపంటే వేస్తారని, నీళ్లు లేకుంటేనే ఇతర పంటలు వేస్తారని తెలిపారు. రైతు బిడ్డను అని చెప్పుకునే సీఎంకు ఈ విషయం తెలియడంలేదని ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, దానం నాగేందర్, ఎమ్మెల్యే లు కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.