MLC Kalwakuntla Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ అభిమానులు శుక్రవారం రాత్రి ఆందోళనలకు దిగారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగామ క్రాస్ రోడ్డు వద్ద మహిళలు రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ తదితరులు సారధ్యం వహించారు.
యాదాద్రి -భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ కార్నర్ వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి వీడాలని బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడే ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్ దావ వసంత సారధ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా తెలిపారు. మెట్ పల్లిలో ధర్నాతో నిరసన తెలిపారు. కవిత అరెస్టును నిరసిస్తూ ముస్తాబాద్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నిరసనగా దేవరకొండలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు ధర్నా చేశాయి. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో రాజకీయ కుట్రగా కుట్రలో భాగంగా కవిత అరెస్టు జరిగిందని మండిపడ్డారు.