మేడ్చల్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): బీజేపీపై మాట్లాడే దమ్ము సీఎం రేవంత్రెడ్డికి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి గుండు సున్నా నిధులిచ్చినా సీఎం రేవంత్రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ప్రధాని మోదీ అంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లాలో ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల విజయోత్సవ సభలు ఆదివారం నిర్వహించగా, కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డిపై ఉన్న కేసుల కారణంగానే బీజేపీపై మాట్లాడేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే కేసీఆర్ను రేవంత్రెడ్డి తిడుతున్నారని మండిపడ్డారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వంద రోజుల్లో ప్రజలకిచ్చిన హామీలను నేరవేర్చకుంటే ప్రజల తరఫున పోరాడేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనపై చర్చ
60 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై జిల్లాల్లో, గ్రామాల్లో చర్చ ప్రారంభమైందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా ఓటు వేశామా? అని ప్రజలు చర్చించుకుంటున్నట్టు చెప్పారు. కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయని, వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని తెలిపారు. ప్రజలు మళ్లీ పాతరోజులను గుర్తుచేసుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో రైతుబంధు పథకం నగదు జమ ప్రారంభమైతే 10 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేదని, ఇప్పుడమే 60 రోజులు దాటినా నగదు జమ కాకపోవడంతో రైతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారని చెప్పారు. రైతుబంధు నగదు పడిన వెంటనే టింగ్ టింగ్మని రైతుల ఫోన్లకు మెసేజ్లు వచ్చేవని, ఇప్పుడు అ మెసేజ్ల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నదని అన్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ దానిపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
తెలంగాణ గళం బీఆర్ఎస్సే
తెలంగాణ హక్కులపై పార్లమెంట్లో వినిపించే గొంతు బీఆర్ఎస్ ఎంపీలదేనని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలను గెలిపిస్తే పార్లమెంట్లో వారి గొం తు పెకలదని చెప్పారు. పార్లమెంట్లో మోదీ, రాహుల్గాంధీలను చూసి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడే పరిస్థితి ఉండబోదని అన్నా రు. తెలంగాణకు రావాల్సిన నిధులు రావాలం టే బీఆర్ఎస్ అభ్యర్థులను తెలంగాణ ప్రజలు గెలిపించాల్సిన అవసరమున్నదని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా బీఆర్ఎస్ శ్రేణులందరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ప్రత్యేక స్థానమున్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకొని కాంగ్రెస్ను మడతపెట్టి కొట్టాలని అన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీ సుభాశ్రెడ్డి, రావుల శ్రీధర్రెడ్డి, మల్లారెడ్డి హెల్త్సిటీ చైర్మన్ డాక్డర్ భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
42 చోట్ల ముగిసిన బీఆర్ఎస్ సమావేశాలు
బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేశాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 42 నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు ముగిశాయి. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులను పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నా రు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఊ పు, ఉత్సాహం, ధైర్యాన్ని నింపేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల రెండో వా రంలోగా సమావేశాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో సహా మాజీ స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు హాజరవుతున్నారు. సోమవారం మరో 8 నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చేసే తప్పుడు ప్రచారాలను దీటుగా తిప్పి కొట్టడం, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, వాటి ప్రస్తుత పరిస్థితి ప్రజలకు వివరించడం, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాల్సిన ప్రాధాన్యాన్ని ముఖ్య నాయకులు, కార్యకర్తలకు వివరిస్తున్నారు.