హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ‘ఒక పార్టీని పడగొట్టడమో, మరొక పార్టీని పదవిలోకి తీసుకురావటమో మా ఉద్దేశం కాదు. ప్రజాస్వామ్యం పరిణతి చెందాలి. ప్రజలందరికీ మేలు జరగాలి. అందుకోసం ఎక్కడి దాకైనా కొట్లాడుతాం. కలిసి వచ్చే శక్తులతో కలిసి పోరాడుతాం’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక సందర్భాల్లో వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం చోటుచేసుకొన్న పరిణామాలు గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సరిపోయే సన్నివేశాన్ని ఆవిష్కృతం చేసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని బీఆర్ఎస్, బీఎస్పీ నిర్ణయించుకొన్నాయి. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జాతీయ స్థాయిలో లౌకిక, ప్రజాస్వామ్యశక్తుల పునరేకీకరణ జరగాల్సిన అనివార్యత నెలకొన్నదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న క్రమంలో బీఆర్ఎస్, బీఎస్పీతో దోస్తీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. తాము ఎందుకు బీఆర్ఎస్తో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నామో బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో లౌకికస్వామ్యం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని, వీటి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
2009 తరువాత బీఆర్ఎస్ మరో రాజకీయ పార్టీతో కలిసి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నది. బీఆర్ఎస్(నాటి టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన 2004లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ ఆవిర్భావంతో ప్రజ్వరిల్లిన తెలంగాణవాదంతో ఏకీభవించకపోతే సీట్లు కాదు కదా ఓట్లు కూడా రావని భావించిన కాంగ్రెస్ ఆనాడు బీఆర్ఎస్తో జతకట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2009లో టీడీపీ, సీపీఎం, సీపీఐలతో మహాకూటమి ఏర్పాటులో బీఆర్ఎస్ భాగం అయింది. కరుడుగట్టిన సమైక్యవాద పార్టీలను తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా కేసీఆర్ నాడు పొత్తు రాజకీయాలు నెరిపారు. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి రెండుసార్లు అధికారాన్ని చేపట్టింది.
తెలంగాణకు బీఎస్పీని తెలంగాణ దోస్త్గా రాజకీయవర్గాలు అభివర్ణిస్తాయి. యూపీఏ ప్రభుత్వానికి, ప్రణబ్ముఖర్జీ కమిటీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి అనుగుణంగా లేఖ ఇచ్చారు.