మహబూబాబాద్ : మండల ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్న కురవి ఎంపీపీకి బీఆర్ఎస్ నాయకులు(Brs leadrs) అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. దీంట్లో భాగంగా ఎంపీపీకి తక్షణ సహాయం కింద మూడు లక్షల రూపాయలను బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అందజేసి మానవతను చాటుకున్నారు.
కురవి ఎంపీపీ పద్మావతి రవి నాయక్ ఆర్థిక కష్టాలపై ఇటీవల వరుసగా పత్రికలు, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత(MP Maloth Kavitha) , ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్(Mla Redya naik) లక్ష చొప్పున అందజేశారు. బుధవారం కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్(Brs) ఆత్మీయ సమ్మేళనంలో నగదును అందజేశారు.
వీరితో పాటు సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎర్రంరెడ్డి సుధాకర్రెడ్డి రూ. 50 వేలు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు పాషా, నామ సైదులు, అయ్యగారి పల్లి సర్పంచ్ బజ్జూరి జ్యోత్స్న వెంకట్ రెడ్డి, మానుకోట వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు గార్లపాటి భరద్వాజ రెడ్డి, కూరవి ఆలయ చైర్మన్ రాము నాయక్ తదితరులు స్పందించి ఆర్ధిక సహాయం అందచేశారు. తన ఆర్థిక కష్టాలపై బీఆర్ఎస్ నాయకుల స్పందన చూసిన ఎంపీపీ పద్మావతి దంపతులు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంపై బోరున విలపించి సహాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఎంపీపీని ఆదుకుంటాం : మాలోత్ కవిత
కురవి ఎంపీపీ పద్మావతి రవినాయక్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఎంపీ మాలోత్ కవిత హామీ ఇచ్చారు. త్వరలో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆమెకు అండగా ఉంటామని అన్నారు.