నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్/ హైదరాబాద్, ఏప్రిల్ 3 (సమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో విపక్షాలు కంగుతింటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు అదే పనిగా చేస్తున్న విమర్శలను ఆత్మీయ సమ్మేళనాలు తిప్పికొడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ శ్రేణులకు వివరించడం, విపక్షాల విమర్శల వెనుక దురుద్దేశాన్ని ఎండగట్టడం అనే ద్విముఖ వ్యూహంతో సాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గులాబీ శ్రేణులు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఉన్న ఆదరణను రెట్టింపు చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతిని ఎలా అడ్డుకుంటున్నది? కాంగ్రెస్తో కలిసి ఎలా కుట్రలు చేస్తున్నది? వాటిని గులాబీ శ్రేణులు ఎలా ఎదుర్కోవాలి? అన్న అంశంపై నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీల్లో అంతర్మథనం
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలతో కాంగ్రెస్, బీజేపీ అంతర్మథనంలో పడ్డాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న ఆయా పార్టీల క్యాడర్ బీఆర్ఎస్ వైపు చూస్తున్న విషయాన్ని ఆత్మీయ సమ్మేళనాలే స్పష్టం చేస్తున్నాయి. పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు ఆత్మీయ సమ్మేళనాల వేదికలపై బీఆర్ఎస్లో చేరుతున్నాయి. ఇది బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. బీజేపీ స్ట్రీట్కార్నర్ మీటింగ్లకు ప్రజల నుంచి స్పందన రావడంలేదని, ఇందుకు పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు కారణమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ లోనూ ఆధిపత్య పోరు రగులుతున్నది.
జోరుగా ఆత్మీయ సమ్మేళనాలు
సోమవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగాయి. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, జీ జగదీశ్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.