BRS | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశాలు నేటినుంచి (శనివారం) ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు, మాజీ మంత్రులు టీ హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ హాజరుకానున్నారు. తెలంగాణభవన్లో ప్రతిరోజు ఒకటి చొప్పున లోక్సభ నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించింది. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులనుంచి అద్భుతమైన స్పందన రావడం, వారిలోని ఉత్సాహాన్ని చూసిన పార్టీ నాయకత్వం దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలోనూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించనున్నారు.
మైనార్టీ కమిటీ సమావేశం..
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ రాష్ట్రస్థాయి సమావేశాన్ని శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గస్థాయిలో మైనార్టీల సమావేశాలు నిర్వహించాలని, బీజేపీ, కాంగ్రెస్ మైత్రిని వివరించాలని నిర్ణయించారు.
బీజేపీ మతతత్వ పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెక్యులర్పార్టీగా ఉన్నదని, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ దుష్పప్రచారం చేశారని, దానిని తిప్పికొట్టడంపై సమావేశంలో చర్చించనున్నారు. దీనికోసం రాబోయే రోజుల్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్న దగ్గర సమావేశాలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఇచ్చిన ప్రాధాన్యత, పథకాలు, మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు ఒక్క మైనార్టీని కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదని,ఓట్ల కోసం వాడుకోవడం తప్ప ఏమీ చేయడంలేదని వివరించనున్నారు. ప్రతి జిల్లా నుంచి ముఖ్యనాయకులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.
27వ తేదీన..
సిద్దిపేట నియోజకవర్గ సమావేశానికి మాజీ మంత్రి టీ హరీశ్రావు, బోథ్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వనపర్తికి మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, నల్లగొండ నియోజకవర్గానికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరుకానున్నారు.
28వ తేదీన..
మెదక్ నియోజకవర్గ సమావేశానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సిరిసిల్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ముషీరాబాద్కు ఎమ్మెల్సీ ఎల్ రమణ, పాలకుర్తి నియోజకవర్గ సమావేశానికి మాజీ మంత్రి టీ హరీశ్రావు హజరవుతారు.
29వ తేదీన..
ఆలేరు నియోజకవర్గ సమావేశానికి మాజీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి, నర్సంపేటకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఖైతరాబాద్కు మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జగిత్యాలకు మాజీ మంత్రి హరీశ్రావు, వికారాబాద్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జుక్కల్కు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, వర్ధన్నపేటకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, చేవేళ్ల నియోజకవర్గ సమావేశాలకు కేటీఆర్ హజరవుతారు.