హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): మరో రెండు లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నాగర్కర్నూల్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మెదక్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పీ వెంకట్రామ్రెడ్డి పేర్లను పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు శుక్రవారం ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 13కు చేరింది. మరో నాలుగు
స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. ఇప్పటికే ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, మల్కాజిగిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబ్నగర్ నుంచి మన్నె శ్రీనివాస్రెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్, వరంగల్ నుంచి కడియం కావ్య, జహీరాబాద్ నుంచి గాలి అనిల్కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ను ఖరారు చేసింది. తాజాగా ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, పీ వెంకట్రామ్రెడ్డి గతంలో సివిల్ సర్వెంట్స్ అధికారులుగా పనిచేసినవారు కావడం విశేషం.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ ప్రాంత బిడ్డలుగా వివిధ హోదాల్లో పనిచేసిన ఎంతోమంది ఉద్యమనేత కేసీఆర్తో నడిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్తో మమేకమై పనిచేశారు. ఉద్యమకాలంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఏ రామ్లక్ష్మణ్, ఏకే గోయల్, రామచంద్రుడు, కేవీ రమణాచారి, మాజీ డీజీపీ పేర్వారం రాములు, మరో సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి పోరెడ్డి చంద్రశేఖర్రెడ్డి లాంటి ఎంతోమంది కేసీఆర్తో భుజం భుజం కలిపి పనిచేశారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఇటీవలే బీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు మెదక్ జిల్లా కలెక్టర్గా పని చేసిన పీ వెంకట్రామ్రెడ్డి కూడా ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరగా, ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇప్పుడు వీరిద్దరికి ఎంపీ టికెట్లు ఇవ్వడం విశేషం.