హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): పార్టీ పదవులైనా, ప్రభుత్వ పదవులైనా బీసీ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) బడుగుల రాష్ట్ర సమితిగా గుర్తింపు పొందింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా బీసీ వర్గాల బాగోగుల కోసం గళమెత్తింది. 2004లోనే స్వయంగా నేటి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ సారథి కేసీఆర్ బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలని కోరుతూ రాష్ట్రంలోని బీసీ సంఘాల ప్రతినిధులను వెంటబెట్టుకొని వెళ్లి నాటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసి విజ్ఞప్తిచేశారు. బీసీల జనాభా 54 శాతం ఉన్నదని, వీరి విద్య, ఆర్థిక, సామాజికపరమైన భద్రత, జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా పనిచేయడానికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలని కేసీఆర్ కొట్లాడారు. నాటి యూపీఏ ప్రభుత్వం బీసీ వర్గాలకు ఉద్దేశించి 154 కార్యక్రమాలను అమలు చేస్తామని ప్రకటించిందని, వీటిని అమలు చేయాలంటే బీసీ మంత్రిత్వశాఖ ఉండాలని స్పష్టంచేశారు. ఆ నాడు కేసీఆర్తోపాటు నేటి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్ కృష్ణయ్య కూడా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని కోరారు. కేసీఆర్కు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇదో నిదర్శనం.
బీసీ నేతలకు టీఆర్ఎస్ ప్రోత్సాహం
అవకాశం వచ్చిన ప్రతిసారీ టీఆర్ఎస్ బీసీ వర్గాల నాయకులను ప్రోత్సహిస్తూనే ఉన్నది. పార్టీ స్థాపించిన తర్వాత ఆలె నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ వంటివారిని చేరదీసి పదవులు ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక, అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత కీలకమైన శాసనసభ స్పీకర్ స్థానాన్ని బీసీ వర్గ నాయకుడు సిరికొండ మధుసూదనాచారికి ఇచ్చారు. ఇక మరో కీలకమైన స్థానం శాసనమండలి చైర్మన్ స్థానాన్ని బీసీ వర్గాల నుంచే వచ్చిన కే స్వామిగౌడ్కు ఇచ్చారు. పద్మారావుగౌడ్ ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండగా, మండలి డిప్యూటీ చైర్మన్గా నేతి విద్యాసాగర్ వ్యవహరించిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో బీసీ నాయకులకు కేసీఆర్ మార్గనిర్దేశనం చేయగా టీఆర్ఎస్ నీడలో ఎదిగారు. బీసీల్లో అద్భుతమైన నాయకత్వం ఉన్నదని గుర్తించారు. నాయకత్వ లక్షణాలున్నవారిని ఎంపిక చేసి మరీ సానబెట్టారు. రాజకీయ అవకాశాలు ఇచ్చారు. రాజకీయంగానూ ప్రోత్సహించారు. ఇది ఏ ఒక్క రోజో.. ఒక ఎన్నిక సందర్భంగానో చేయలేదు. పార్టీ ఏర్పాటు నుంచి మొదలు పెట్టారు. ఉద్యమంలోనే రాజకీయ, ఉద్యమ, పోరాట పంథా నేర్పించారు. ఇప్పుడు రాష్ట్రంలో బీసీల పార్టీగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నిలిచింది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్.. కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను బీసీల కోసం రూపొందించి అమలుచేశారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రోత్సహించారు. ఇదంతా రాష్ట్రంలోని బీసీలకు ఎంతో ఉపయోగపడింది.
తరగని ఆదరణ..
రాష్ట్రంలో చేతివృత్తులకు పూర్వవైభవం తీసుకురావడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దీని కోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్ను కూడా ఏర్పాటుచేసింది. బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలవారిని చేరదీయడంతోపాటు వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం ఒక్క టీఆర్ఎస్ కావడం గమనార్హం. 2018 శాసనసభ ఎన్నికలను పరిశీలిస్తే టీఆర్ఎస్ 28 స్థానాలను బీసీలకు కేటాయించింది. 2014 శాసనసభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను బీసీలకు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీసీలకు కేటాయించిన స్థానాలకన్నా అదనంగా 30 సీట్లను బీసీలకే ఇచ్చారు. ఇక ప్రస్తుత టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు బీసీనే. ఆయన పార్టీ సెక్రటరీ జనరల్గా కూడా ఉన్న విషయం తెలిసిందే. పార్టీలో అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైన స్థానం సెక్రటరీ జనరల్కే ఉంటుంది. అలాంటి స్థానంలో కేశవరావు ఉన్నారు. ఈటల రాజేందర్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా చేయడంతోపాటు ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రిని కూడా చేసింది కేసీఆరే. ఇక పార్టీలో అన్ని స్థాయిల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ పదవుల్లో కూడా అవకాశాలు కల్పించారు.