కరీంనగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో బీఆర్ఎస్కు బలమైన ప్రాతినిధ్యం లేకుంటే బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం వేములవాడ, మానకొండూర్, కరీంనగర్ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాల్లో, చొప్పదండిలో రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ప్రసంగించారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎందుకు ఉండాలనే దానిపై స్పష్టత ఇచ్చారు. వచ్చే జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు నిండుతాయని, అప్పటి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు తీరుతుందని గుర్తుచేశారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయటానికి కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. అలా జరగొద్దు అనుకుంటే.. బీఆర్ఎస్కు పార్లమెంట్లో గట్టి బలం ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఓట్ల కోసం మన అవసరాలు తీరకుండానే గోదావరి జలాలను తమిళనాడు, కర్ణాటకకు తరలించేలా కావేరి నదితో అనుసంధానం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.
తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వని బీజేపీ.. తెలంగాణను ఎండబెట్టి ఇతర రాష్ర్టాలకు తీసుకెళ్లాలని చూస్తున్నదని చెప్పారు. 2026లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను పునర్విభజన చేస్తుందని, కొన్ని కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారని, ఆ సమయంలో ఉత్తరాది రాష్ర్టాల్లో జనాభా ఎక్కువ, దక్షిణాది రాష్ర్టాల్లో తక్కువని చెప్పి దక్షిణాదికి తక్కువ నియోజకవర్గాలు ఏర్పాటు చేసే ప్రమాదం ఉన్నదని, అందుకే పార్లమెంట్లో కొట్లాడేందుకు బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని తెలిపారు. తమకు మూడింట రెండో వంతు మెజార్టీ ఇస్తే ఎస్టీ, ఎస్టీల రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని, రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని వెల్లడించారు. బీజేపీకి ఓటు వేస్తే వ్యవసాయ బావుల కాడ మోటర్లకు మీటర్లు పెట్టుడు పక్కా అని తెలిపారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆపారని, రేవంత్రెడ్డికి అంత దమ్ము లేదని స్పష్టం చేశారు. ఆయన మీద కేసులు ఉన్నాయని, మోదీ బెదిరిస్తే భయపడతాడని ఎద్దేవా చేశారు.
బడేభాయ్, చోటాభాయ్ కలిసి రాష్ర్టానికి మోసం
2014లో బడేభాయ్ నరేంద్రమోదీ మోసం చేస్తే, 2023లో చోటాభాయ్ రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలను మరింత మోసం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. జనధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారని, పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? అన్ని ప్రశ్నించారు. చోటాభాయ్ రేవంత్రెడ్డి కూడా అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటికూడా నిలబెట్టుకోలేని బీజేపీ, కాంగ్రెస్కు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. ప్రధాని మోదీ పేద, మధ్య తరగతి ప్రజలను వంచించారని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ మీద ప్రత్యేక సుంకం వసూలు చేసి, టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారని మోదీని ప్రశ్నించారు. పదేండ్ల పాలనలో హిందూ, ముస్లిం అనే విషాన్ని ప్రజల్లో నింపారని ధ్వజమెత్తారు. ‘ఉంటే నా జేబులో ఉండు.. లేదంటే జైల్లో ఉండు’ అన్న చందంగా మోదీ పాలన సాగుతున్నదని ఆరోపించారు. ఈ విధానాలు నచ్చని కేసీఆర్ గట్టిగా కొట్లాడితే ఆయన బిడ్డను తీసుకెళ్లి జైల్లో పెట్టారని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను జైలుకు పంపించారని గుర్తుచేశారు. మమతా బెనర్జీ, స్టాలిన్పైనా కేసులు పెట్టారని వెల్లడించారు.
మోదీకి ఓటెందుకేయాలి?
తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధాని మోదీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలి? అని కేటీఆర్ ప్రశ్నించారు. మనల్ని అడగకుండానే భద్రాద్రిలో ఐదు మండలాలను ఆంధ్రాలో కలిపేశారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, సిరిసిల్ల టెక్స్టైల్ క్లస్టర్లు, బయ్యారం ఉక్కు ఫాక్టరీలో ఏ హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు ఉన్న ఐటీఐఆర్ని కూడా ఎత్తివేసిందని తెలిపారు. శ్రీరాముడు అందరివాడని, ఎమ్మెల్యే, ఎంపీ కాదని, మంచిపని చేసేవాళ్లకే అధికారం ఇవ్వాలని ఆయన చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. బండి సంజయ్ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ఇల్లందకుంట సీతారామస్వామి, సిరిసిల్ల మారండేయ ఆలయాలకు ఒక్క రూపాయైనా కేంద్రం నుంచి తెచ్చారా? అని ప్రశ్నించారు. వినోద్కుమార్ లాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉంటేనే కాంగ్రెస్, బీజేపీతో కొట్లాడుతారని స్పష్టం చేశారు. పార్లమెంట్ పరిధిలో ఏ ఊరిలోనైనా బండి వేసిన శిలాఫలకం ఉన్నదా? అని ప్రశ్నించారు. అల్గునూర్లోని లక్ష్మీనరసింహ గార్డెన్లో ఒకవైపు బండి, మరో వైపు వినోద్కుమార్ను నిలబెట్టి కరీంనగర్ నియోజకవర్గానికి ఎవరు ఏం చేశారో చెప్పిద్దాన్నారు. వారు చెప్పిన విషయాలను బట్టి ప్రజలను తీర్పు అడుగుదామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్, బీజేపీది మ్యాచ్ ఫిక్సింగ్ అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద కండువా తీసి నిలబెడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తుపట్టలేరని ఎద్దేవా చేశారు. నిజానికి కరీంనగర్లో జీవన్రెడ్డి లేదా ప్రవీణ్రెడ్డి వంటి నాయకులు పోటీ చేయాల్సి ఉండేదని, వీరిద్దరైతే గట్టిపోటీ ఇస్తారని సీఎం రేవంత్రెడ్డి, బండి సంజయ్ కలిసి డమ్మీ అభ్యర్థిని ఎంపిక చేశారని ఆరోపించారు. రేవంత్రెడ్డివి చిల్లర మాటలు, ఉద్దెర పనులు అని విమర్శించారు.
బీఆర్ఎస్కే ప్రజా బలం
రాష్ట్రంలో ప్రజా బలం బీఆర్ఎస్కే ఉన్నదని, పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకుంటే ఏడాది కాలంలో కేసీఆర్ దేశరాజకీయాలను శాసించే స్థాయికి వస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్కు అన్ని వర్గాల ప్రజలు అనుకూలంగా ఉన్నారని, ఇప్పుడు మనం గట్టి పునాది వేసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు మంచి అవకాశం ఉంటుందని అన్నారు. జూన్ 4 తర్వాత గెలిచిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు లేని చోట ఎమ్మెల్యేగా పని చేస్తారని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని స్పష్టం చేశారు.
70 ఏండ్ల వయసులోనూ కష్టపడుతున్న కేసీఆర్
70 ఏండ్ల వయసులో, తొంటి ఎముక విరిగినా.. పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రతో ప్రజల వద్దకు వచ్చి ప్రచారం చేస్తూ కష్టపడుతున్నారని కేటీఆర్ తెలిపారు. 12 బీఆర్ఎస్ సీట్లు గెలిపిస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు ఏడాదిలోపే వస్తుందని కార్యకర్తలకు ధైర్యాన్ని నింపారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, భానుప్రసాద్రావు, మేయర్ సునీల్రావు, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జీవీ రామకృష్ణారావు, తోట ఆగయ్య, తదితరులు పాల్గొన్నారు.