హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ (BRS) పార్టీ మొదటి రోజు నుంచి పోరాడుతున్నది. ఇందులో భాగంగా రైతు సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చింది. పెట్టుబడి సాయంతోపాటు రూ.2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణ మాఫీ చేయడంతోపాటు.. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సహాయం అందక, రుణమాఫీ కాక, అన్ని పంటలకు బోనస్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ యాసంగికి వానాకాలంతో కలిపి ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలి. రూ.2 లక్షల వరకు అందరు రైతులకు రుణమాఫీ చేయాలని, అన్ని పంటలకు వెంటనే బోనస్ చెల్లించాలని కోరుతూ.. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించింది.