హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భారీ కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేసింది. ఈ నెలాఖరు నుంచి అనేక రాష్ర్టాల్లో వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రణాళిక రచించినట్టు తెలిసింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన వెంటనే ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించి.. పార్టీ విస్తరణకు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాది రాష్ర్టాల నుంచి ఉప్పెనలా తరలివచ్చిన ప్రజా ప్రభంజనాన్ని చూసి ఇతర పార్టీల్లో గుబులు మొదలైంది. బీఆర్ఎస్కు ఆయా ప్రాంతాల్లో క్రేజ్ ఏ స్థాయిలో ఉన్నదనేది కూడా అందరికీ తెలిసి వచ్చింది. అదే ఊపును కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా వరుస సమావేశాలు నిర్వహించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం.
భారత రాష్ట్ర కిసాన్ సమితి సభలతో మొదలు
పార్టీ విస్తరణలో భాగంగా రాజకీయ సభలు, సమావేశాలతోపాటు అనుబంధ సంఘాలతో భారీఎత్తున సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి కోసం చేపట్టిన విప్లవాత్మక పథకాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు పలు రాష్ర్టాల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, హర్యానా, యూపీ తదితర రాష్ర్టాల నుంచి బీఆర్ఎస్ కిసాన్ సమితిలో చేరేందుకు పలువురు రైతు నేతలు ఎదురుచూస్తున్నారు. వీరందరినీ కలుపుకొని భారీ సభలు నిర్వహించేందుకు సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాంసింగ్ సారథ్యంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా ఆరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిసాన్ సమితి శాఖలను ప్రారంభించాలని నిర్ణయించారు.
వివిధ రాష్ర్టాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నాయకులు కేసీఆర్తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎలాంటి విధానాలను అవలంబించాలనే అంశంపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. నెలాఖరుకల్లా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఏపీ, తెలంగాణ లో కిసాన్ సమితి శాఖలను ప్రారంభించనున్నారు.
ఏపీ నుంచి అద్భుత స్పందన
తెలంగాణ రాష్ట్ర ప్రగతి మన పొరుగున ఉన్న ఏపీ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నది. బీఆర్ఎస్లో పనిచేయడానికి తమకు అవకాశం కల్పించాలని కేసీఆర్తో ఇప్పటికే పలువురు నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆంధ్రాలోని పలు జిల్లాల్లో బీఆర్కేఎస్ను ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికే 70-80 మంది ప్రముఖులు కేసీఆర్ను సంప్రదించి వెళ్లి క్షేత్రస్థాయిలో సమాయత్తం అవుతున్నారు.
బీఆర్ఎస్ భావజాల వ్యాప్తి
బీఆర్ఎస్ భావజాల వ్యాప్తిపై అధినేత కేసీఆర్ పలు భాషల రచయితలు, సాహితీవేత్తలతో సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ, ఒరియా, మరాఠీ తదితర భాషల రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో చర్చలు జరిపారని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే కార్యాచరణ, భావజాల వ్యాప్తి కోసం విస్తృతంగా చర్చలు చేపట్టారు. దేశంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో రావాల్సిన గుణాత్మక మార్పులు ఏమిటి? వాటిని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దేశ ప్రజలకు అందించబోతున్నది? ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీఆర్ఎస్ తన పాత్రను భవిష్యత్తులో ఎట్లా పోషించబోతున్నది? అనేది సైద్ధాంతిక అంశాలను పలు భాషా సాహిత్యాలు, రచనలు పాటల ద్వారా భావజాల ప్రచారం జరుగనున్నది.
నెలాఖరులో ఢిల్లీలో జాతీయ మీడియా సమావేశం
బీఆర్ఎస్ ఆవిర్భావంపై జాతీయ మీడియాలో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. పార్టీ విధి విధానాలు, రాజకీయ సైద్ధాంతికత ఏమిటి అభివృద్ధి నమూనా ఏమిటి? అనే విషయంలో జాతీయ మేధావి వర్గంలో చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జాతీయ మీడియాతో ఈ నెలాఖరులో కేసీఆర్ భేటీ కానున్నారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులతో సమావేశమై బీఆర్ఎస్ సిద్ధాంతాలు, భవిష్యత్తు, కార్యాచరణ తదితర అంశాలను ప్రకటించనున్నారు.
కర్ణాటకలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి
గద్వాల, డిసెంబర్ 20 : కర్ణాటక రాష్ట్రంలో బీఎఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నట్టు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కర్ణాటకలోని రాయిచూర్లో వివిధ పార్టీల నాయకులు, రైతు సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండ్ల మాట్లాడుతూ, తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కర్ణాటకవాసులు బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు.