CM Revanth Reddy | వరంగల్, పరకాల ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రేవంత్ రాజ్యంలో ‘జై తెలంగాణ’ అని నినదించడమే పాపమై పోయింది. ‘జై తెలంగాణ’ అని నినదించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ జాతరలో జరిగిన చిన్న విషయాన్ని పట్టుకొని 12 మందిని స్టేషన్కు పిలిచి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. రాత్రికిరాత్రే అక్రమంగా తీసుకెళ్లి పోలీసు జులుం చూపించడం, బాధితులు తీవ్రంగా గాయపడటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు మండలంలో ఆదివారం చోటు చేసుకున్న ఘటనలో పోలీసుల ఓవర్ యాక్షన్పై ప్రజల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామం మినీ మేడారం జాతరలో భాగంగా ఈ నెల 23న సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకొనేందుకు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు జాతరకు వచ్చారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తల్లుల దర్శనం చేసుకుంటున్నారనే నెపంతో పోలీసులు గద్దెల గేట్లను మూసివేశారు. దీంతో కొద్దిసేపు ధర్మారెడ్డి దంపతులు గద్దెల బయటనే వేచి ఉన్నారు. అనంతరం పోలీసులు గేట్లను తెరువడంతో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ‘జై తెలంగాణ’ నినాదాలు చేసుకుంటూ దర్శనం చేసుకున్నారు.
స్థానికంగా విధులు నిర్వహించే కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు 10 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఘటన చోటు చేసుకున్న రెండురోజుల అనంతరం పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను, బీఆర్ఎస్ నాయకులను ‘ఆత్మకూరు సీఐ పిలుస్తున్నారు.. ఏదో విషయం మాట్లాడాలని’ చెప్పి దామెర, ఆత్మకూరు మండలాల వైస్ ఎంపీపీలు ఎండీ జాకీర్ అలీ, రేవూరి సుధాకర్రెడ్డి, ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కూస కుమారస్వామి, రేగుల కిశోర్, పెద్దాపూర్కు చెందిన వేల్పుల గణేశ్, అగ్రంపాడ్కు చెందిన ఆవుల శ్రీనివాస్, వంచ సాంబశివరెడ్డి, గూడెప్పాడ్కు చెందిన కాంతాల కేశవరెడ్డి, కాంతాల రవీందర్రెడ్డి, దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ నేరెళ్ల కమలాకర్ను తీసుకెళ్లారు. మరో ఇద్దరిని కలుపుకొని మొత్తం 12 మందిపై ఐపీసీలోని 143, 149, 353 సెక్షన్ల కింద కేసు పెట్టారు. అవన్నీ స్థానిక ఠాణాలో బెయిల్ ఇచ్చే సెక్షన్లే కావడం గమనార్హం.
12 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీస్స్టేషన్కు తరలించకుండా హనుమకొండలో ఉన్న టాస్క్ఫోర్స్ స్టేషన్కు పోలీసులు తరలించారు. అక్కడా ఏసీపీ ఆధ్వర్యంలో వారిని టాస్క్ఫోర్స్ పోలీసుల పేరుతో బట్టలు ఊడదీసి బూతులు తిడుతూ విచక్షణారహితంగా కొట్టారు. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొదద్దని, ఎక్కడ చెప్పినా రౌడీ షీట్ ఓపెన్ చేయడంతోపాటు టాడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం టాస్క్ఫోర్స్ స్టేషన్ నుంచి పరకాల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినవారిని వరంగల్ ఎంజీఎం దవాఖానలో చేర్చి, చికిత్స అందించారు.
విషయం తెలుసుకొనేందుకు ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసులు సరైన సమాచారం అందివ్వలేదని బాధితుడు గణేశ్ కుటుంబ సభ్యులు వాపోయారు. అసలు శుక్రవారం గణేశ్తోపాటు కుటుంబ సభ్యులందరం మినీ మేడారం జాతరకు వచ్చామని, ఆ సమయంలో అక్కడకు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వచ్చారంటే గణేశ్ మాజీ ఎమ్మెల్యేను కలిసి వస్తానని చెప్పి 10 నిమిషాల్లోనే వెళ్లివచ్చారని తెలిపారు. తీరా ఆదివారం ఉదయం 3-4 గంటల ప్రాంతంలో ఆత్మకూరు ఎస్సై వచ్చి ఆగ్రంపహాడ్ జాతరలో జరిగిన లొల్లి విషయమై సీఐ తీసుకురమ్మంటున్నారని చెప్పారని అన్నారు. తమకు ఆ లొల్లికి సంబంధం లేదని చెప్పినా 10 గంటల వరకు ఇంటికి రావొచ్చని చెప్పి తీసుకెళ్లారని తెలిపారు.
పోలీసులు కొట్టడంతో గాయాలైన బాధితులు, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి కడియం శ్రీహరి విలేకరులతో మాట్లాడారు. ‘మనం ఎక్కడ ఉన్నాం. 30 ఏండ్ల క్రితం కూడా ఇలాంటి దుస్థితి లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే దాడులేనా?’ అని ప్రశ్నించారు. వరంగల్ పోలీసు కమిషనర్కు 24 గంటల గడువు ఇస్తున్నామని, అన్యాయంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన స్పందన ఉంటుందని హెచ్చరించారు. ఈనెల 27న ‘ఛలో ఆత్మకూరు’ నిర్వహిస్తామని తెలిపారు. హైకోర్టుకు, మానవ హక్కుల కమిషన్కు వెళ్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్తున్న కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై ఇప్పటికే 2,600 కేసులను నమోదు చేశారని ధ్వజమెత్తారు. పరకాల, ఆత్మకూరు పోలీసు అధికారులు బీఆర్ఎస్ వాళ్లను ఇష్టం వచ్చినట్టు కొట్టారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. ఇవి రాజకీయప్రేరిత దాడులని అభివర్ణించారు.